నేను అనుకున్న సవాల్ ఎదురవ్వలేదు.. అతి త్వరలోనే సెంచరీ కొడతా: రోహిత్ శర్మ

రాయ్పూర్: న్యూజిలాండ్తో రెండో వన్డేలో తాను ఊహించిన పరిస్థితులు ఎదురవ్వలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బౌలింగ్కు అనుకూలమైన పిచ్పై కఠిన పరిస్థితుల్లో చేజింగ్ చేయాలనుకున్నామని తెలిపాడు. శనివారం ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన రోహిత్ శర్మ.. బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. అతి త్వరలోనే తాను భారీ స్కోర్ చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు. మూడో వన్డే గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాడు.

గట్టి సవాల్ ఎదురవుతదనుకుంటే..?
'గత ఐదు మ్యాచ్ల్లో మా బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. మేం అడిగిందల్లా చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఇక భారత్లో ఇలాంటి పేస్ పిచ్లను చూసుండరు. విదేశాల్లోనే ఇలాంటి వికెట్లను తరుచూ చూస్తుంటాం. మా బౌలర్లలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాలున్నాయి. శుక్రవారం ఇక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫ్లడ్ లైట్స్ కింద బంతి స్వింగ్ అవ్వడం గమనించాం. దాంతో న్యూజిలాండ్ 250 పరుగులు చేసినా పోరాడే లక్ష్యమని భావించాం. ఈ ఆలోచనతోనే చేజింగ్కు మొగ్గు చూపాను. గత మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేయడంతో.. ఈ మ్యాచ్లో మమ్మల్ని మేం సవాల్ చేసుకోవాలనుకున్నాం. కానీ మేం అనుకున్న కఠిన పరిస్థితులు ఎదురవ్వలేదు.

త్వరలోనే బిగ్ స్కోర్..
ఇండోర్ వేదికగా జరిగే చివరి వన్డే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. జట్టులో ప్రతీ ఒక్కరి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. జట్టును ఇలా చూడటం గొప్పగా ఉంది. షమీ, సిరాజ్లు లాంగ్ స్పెల్స్ వేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఉందనే విషయాన్ని వారికి నేను గుర్తు చేస్తున్నాను. ఈ సిరీస్ నేపథ్యంలో మేం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను నా ఆటను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. బౌలర్లపై ఎదురుదాడికి దిగడం ముఖ్యమని భావిస్తున్నా. నేను భారీ స్కోర్లు చేయడం లేదనే విషయం తెలుసు. దాని గురించి నేను బాధపడటం లేదు. అతి త్వరలోనే భారీ స్కోర్ సాధిస్తాననే నమ్మకం ఉంది'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన బౌలర్లు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. భారత బౌలర్లు విజృంభించడంతో 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/18) మూడు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా(2/16), వాషింగ్టన్ సుందర్(2/7) రెండేసి వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ దక్కించుకున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లేన్ ఫిలిప్స్(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్ బ్రేస్వెల్(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

రోహిత్ హాఫ్ సెంచరీ..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 51), శుభ్మన్ గిల్(53 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్) పర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో షిప్లే, సాంట్నర్ తలో వికెట్ తీసారు. నాలుగు వికెట్లతో భారత విజయం కీలక పాత్ర పోషించిన మహమ్మద్ షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. చివరి వన్డే ఇండోర్ వేదికగా మంగళవారం(జనవరి 24) జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications