బౌలింగ్ వైఫల్యమే..
'నా బొటన వేలి గాయం తీవ్రంగానే ఉంది. డిస్ లొకేట్ అవ్వడంతో కుట్లు వేసారు. అదృష్టవశాత్తు ఫ్రాక్చర్ లేకపోవడంతో బ్యాటింగ్ చేయగలిగాను. ఓటమి ఎదురైనప్పుడు ప్రతికూలాంశాలతో పాటు సానుకూలాంశాలు కూడా ఉంటాయి. 69/6తో ఉన్న బంగ్లాదేశ్ను 270 పరుగులు చేయించడమే మేం చేసిన అతిపెద్ద తప్పు. ఆరంభంలో అదరగొట్టిన మా బౌలర్లు మరోసారి మిడిల్, డెత్ ఓవర్లలో విఫలమయ్యారు. గత మ్యాచ్లోనూ మా బౌలర్లు ఈ తప్పిదమే చేశారు. దీనిపై మేం వర్క్ చేయాల్సి ఉంది. మెహ్దీ హసన్, మహ్మదుల్లా అసాధారణ భాగస్వామ్యం నెలకొల్పారు.
భాగస్వామ్యాలు కీలకం..
ఇలాంటి భాగస్వామ్యాలను విడదీయడానికి కావాల్సిన మార్గాలను అన్వేషించాలి. వన్డే క్రికెట్లో భాగస్వామ్యాలు నెలకొల్పడం చాలా ముఖ్యం. బంగ్లా ఆటగాళ్లు మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పారు. 70 పరుగుల భాగస్వామ్యాన్ని 110-120గా మార్చాలి. అయితే క్రీజులోకి వచ్చిన కొత్త బ్యాటర్లకు ఇది అంత సులువైన పనికాదు. మిడిల్లో కాస్త ధైర్యంగా ఆడాలి. జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఈ గాయాలపై మేం సీరియస్గా ఫోకస్ పెట్టాలి. భారత జట్టు తరఫున ఆడుతున్నప్పుడు 100 శాతం ప్రదర్శన ఇవ్వాలి. ఆటగాళ్ల వర్క్ లోడ్ను కాస్త పర్యవేక్షించాలి. హాఫ్ ఫిట్గా వచ్చి ఆడాలంటే కుదరదు. మూడో వన్డే మార్పుల గురించి నాకు కూడా తెలియదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
మెహ్దీ హసన్ సెంచరీ..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులు చేసింది. మెహ్దీ హసన్(83 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 100 నాటౌట్) విరోచిత సెంచరీతో చెలరేగగా.. మహ్మదుల్లా(96 బంతుల్లో 7 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు. 69 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఈ జోడీ 148 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకుంది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
రోహిత్ చెలరేగినా..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసి ఓటమిపాలైంది. శ్రేయస్ అయ్యర్(102 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 82), అక్షర్ పటేల్(56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 56) అర్థ సెంచరీలతో రాణించగా.. చివర్లో రోహిత్ శర్మ (28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 51 నాటౌట్) పోరాడినా విజయం దక్కలేదు. కీలక సమయంలో సిరాజ్ 12 బంతులు ఆడి 2 పరుగులే చేయడం టీమిండియా పతనాన్ని శాసించింది.