ఒక్క రాత్రికి ఫలితాలు రావు..
‘మరో జట్టుతో రోహిత్ శర్మ ఇలాంటి ఫలితాలు సాధించేవాడా అని కొందరు అడుగుతున్నారు. అసలు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి. ఎందుకు సాధించి చూపించాలి. మా ఫ్రాంచైజీ ఆలోచనల ప్రకారమే నేను ఆటగాడిగా, కెప్టెన్గా కావాల్సిన పనితీరును ప్రదర్శించా. ఒక్క రాత్రికి ఫలితాలు రాలేదు. పొలార్డ్, బుమ్రా, హార్దిక్ పాండ్యాలాంటి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారనే మాటను అంగీకరిస్తా.
నా విజయం రహస్యం అదే..
అయితే 2011లో నాతో సహా అందరూ వేలంలో అందుబాటులో ఉన్నారు కదా. కానీ ముంబై మమ్మల్ని ఎంచుకుంది. మాపై నమ్మకముంచి జట్టును తీర్చి దిద్దుకుంది. ఇష్టమున్నట్లు ఆటగాళ్లను మార్చేయలేదు. బౌల్ట్ గత ఏడాది ఢిల్లీకి, అంతకుముందు సన్రైజర్స్ హైదరాబాద్కు కూడా ఆడాడు కదా. ఆరంభంలోనే బంతిని స్వింగ్ చేసి వికెట్లు తీయగల బౌలర్ మాకు అవసరం ఉందని భావించాం. అందుకే ఢిల్లీతో గట్టిగా పట్టుబట్టి బౌల్ట్ను తీసుకున్నాం. ఆపై అతను సత్తా చాటాడు. నా మనసుకు సరైంది అనిపించేది చేయడమే నా విజయ రహస్యం' అని రోహిత్ విశ్లేషించాడు.
సూర్య క్లారిటీతో ఉన్నాడు..
సూర్య కుమార్ యాదవ్ తన కెరీర్ విషయంలో చాలా క్లారిటీతో ఉన్నాడని రోహిత్ చెప్పుకొచ్చాడు. ‘సూర్య తన కెరీర్ విషయంలో క్లారిటీతో ఉన్నాడు. నేషనల్ సెలెక్షన్స్ జరిగిన రోజు మేమంతా టీమ్ రూమ్లోనే కలిసి ఉన్నాం. సూర్య నిరాశలో ఉన్నాడని అర్థమైంది. అందుకే అతనితో మాట్లాడాలని ట్రై చేయలేదు. కానీ తనే చొరవ తీసుకుని ముందు మాట్లాడాడు. ఏం ఫర్వాలేదు, ముంబై కోసం మ్యాచ్లు గెలిపిస్తానని చెప్పాడు. ఆ మాట విన్నాక.. క్లారిటీతో ఉన్నాడని, సరైన దారిలో వెళుతున్నాడని అర్థమైంది. అతను ఇండియాకు ఆడే టైమ్ వస్తుంది'అని రోహిత్ తెలిపాడు.
ఏం జరుగుతుందో తెలియదు..
ఐపీఎల్లో తాను కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ విషయాన్ని అటు బీసీసీఐకి, ఇటు ముంబై ఇండియన్స్కు స్పష్టంగా తెలియజేసినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ అంశంపై బయటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలను తాను పట్టించుకోనని అతను చెప్పాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే ఆ సమయంలో బయట అసలు ఏం జరుగుతుందో, అందరూ దేని గురించి చర్చించుకుంటున్నారో కూడా నాకు తెలీదు. నేను బీసీసీఐ, ముంబై ఇండియన్స్కి గాయం గురించి స్పష్టంగా వివరించాను. గాయమైన తర్వాత నేను తర్వాతి మ్యాచ్లు ఆడగలనా లేదా అని ఆలోచించాను.
అయితే మైదానంలో దిగితే తప్ప దాని తీవ్రత తెలీదు. టీ20 ఫార్మాట్లో ఎక్కువగా ఇబ్బంది ఉండదు కాబట్టి ఆడగలనంటూ ముంబై యాజమాన్యానికి చెప్పాను. ప్రతీ రోజూ ఫిట్నెస్ మెరుగవుతుండటంతో మళ్లీ బరిలోకి దిగాను. బాగుంటేనే ప్లే ఆఫ్స్ ఆడతానని, లేదంటే తప్పుకుంటానని కూడా వారికి స్పష్టం చేశాను. నా గాయం గురించి, ప్లే ఆఫ్స్లో ఆడటం, ఆస్ట్రేలియాకు వెళ్లడం గురించి ఫలానా వ్యక్తి ఫలానా మాట అన్నాడు అంటే నేను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని రోహిత్ శర్మ వివరించాడు.
భారత్ వెళ్లేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా... జట్టు కోసం ఆస్ట్రేలియాలోనే ఆగిపోయిన సిరాజ్!