India vs Australia: రోహిత్ శర్మ గాయం విషయంలో బీసీసీఐ నిర్లక్ష్యమే కొంపముంచిందా?

హైదరాబాద్: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్లో తొలి రెండు మ్యాచ్ లకు అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరమవ్వనున్నారనే వార్త భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అటు ప్రధాన బ్యాట్స్మన్ రోహిత్, ఇటు వెటరన్ పేసర్ ఇషాం త్ ఇద్దరూ దూరమవడం భారత జట్టుకు ఒక విధంగా గట్టి దెబ్బే. జట్టు బ్యాటింగ్, బౌలింగ్లపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే చివరి రెండు టెస్టుల వరకల్లా అందుబాటులోకి రావాలని జట్టుతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆశిస్తోంది. నిజానికి టెస్టు సిరీస్కు సమయమున్నప్పటికీ ఆస్ట్రేలియాలో అమలవుతున్న కఠిన కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పటికిప్పుడు బయల్దేరితేనే తొలి టెస్టు ఆడగలరు.
ఇదే విషయాన్ని ఆదివారం హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పారు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు. అందుకే సీనియర్ ఆటగాళ్లు తొలి రెండు టెస్టులకు దూరమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ పరిస్టితికి బోర్డు నిర్లక్ష్యమే కారణమనే వాదన వినిపిస్తుంది.

కమ్యూనికేషన్ గ్యాప్..
తొలి టెస్టు తర్వాత కోహ్లీ సిరీస్కు దూరం అవుతున్న నేపథ్యంలో హిట్మ్యాన్ కీలకం అవుతారని అంతా ఆశించారు. కానీ, అతను ఆసీస్ విమానం ఎక్కడమే ప్రశ్నార్థకంగా మారడం శోచనీయం. రోహిత్ గాయం చుట్టూ ఉన్న అంశాలను పరిశీలిస్తే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలకు, బీసీసీఐ మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టమతోంది.
ఐపీఎల్ 13 లీగ్ స్టేజ్ సందర్భంగా రోహిత్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ లోపు ఆస్ట్రేలియా టూర్కు జట్లను ప్రకటించిన సెలెక్టర్లు రోహిత్ను పూర్తిగా పక్కనపెట్టేశారు. దీంతో రోహిత్ ఐపీఎల్ జర్నీ కూడా ముగిసిందని అంతా భావించారు. కానీ సెలెక్షన్ జరిగిన రోజునే ట్రెయినింగ్ రీస్టార్ట్ చేసిన రోహిత్.. చివరి మూడు మ్యాచ్ల్లో బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో వెంటనే రివైజ్డ్ టీమ్ ప్రకటించిన సెలెక్టర్లు టెస్ట్ సిరీస్కు రోహిత్ను ఎంపిక చేశారు.

ఐపీఎల్కే ప్రాధాన్యం..
లీగ్ పూర్తయ్యాక రిహాబిలిటేషన్ కోసం ఎన్సీఏకి రప్పించారు. కానీ రోహిత్ గాయపడిన రోజు తర్వాత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కీలక కామెంట్స్ చేశారు. రీఎంట్రీకి తొందరపడితే రోహిత్ కెరీర్కే ముప్పు అని అభిప్రాయపడ్డారు. దీని బట్టి ముంబైకర్కు అయిన గాయం తీవ్రత బోర్డుకు స్పష్టంగా తెలుసు. అయినా రోహిత్ బరిలోకి దిగాడంటే.. బీసీసీఐకి,ముంబై ఇండియన్స్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అర్థమవుతోంది. అంతేకాక ఇషాంత్ మాదిరిగా రోహిత్ను లీగ్ నుంచి ఎందుకు తప్పించలేదని ప్రశ్న తలెత్తుతోంది. దీంతో ఇటు బోర్డు, అటు ప్లేయర్లు.. అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్కే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో కూడా..
ఇప్పుడు రోహిత్ విషయంలోనే కాదు.. 2018లో భువనేశ్వర్ కుమార్ విషయంలోనూ బీసీసీఐ ఇలానే వ్యవహరించింది. ఆ సీజన్ ఐపీఎల్లో భువీ లోయర్ బ్యాక్ ఇంజ్యురీతో బాధపడ్డాడు. కానీ, అతని వర్క్లోడ్ విషయంలో బోర్డు నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి ఎలాంటి సమాచారం రాలేదు. దాంతో కీలక ఇంగ్లండ్ టూర్ను భువీ మిస్సయ్యాడు. అలాగే, రెండు గాయాలతో బాధపడుతున్న వృద్ధిమాన్ సాహాను టీమ్తో పాటు ఆసీస్ తీసుకెళ్లిన మేనేజ్మెంట్ రోహిత్, ఇషాంత్ను కూడా తీసుకెళ్తే వాళ్లు కూడా అక్కడే రిహాబిలిటేషన్లో పాల్గొంటూ ఫిట్నెస్ పెంచుకునే ప్రయత్నం చేసుకునేవారు. కానీ, బోర్డు ఈ విషయంలో ఎందుకు వెనకడుగు వేసిందో అర్థం కావడం లేదు.

డబ్బు కోసం..
మరోపక్క డబ్బు కోసం రోహిత్ తన కెరీర్ను పణంగా పెట్టాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కోచ్ రవిశాస్త్రి, బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీతోపాటు పలువురు సీనియర్లు గాయం విషయంలో చేసిన సూచనలను తన ఫ్రాంచైజీ కోసం హిట్మ్యాన్ పెడచెవిన పెట్టాడనే విమర్శలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బోర్డుల మాదిరిగా బీసీసీఐ కఠినంగా ఉండుంటే రోహిత్ ఇలా చేసే వాడు కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నాలుగున్నర నెలల్లో 22 సార్లు కోవిడ్ టెస్ట్లు చేసుకున్నా : గంగూలీ
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications