ముంబై : కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఐపీఎల్ 2020 సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ ఫస్ట్ వీక్ వరకు యూఏఈలో దాదా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ప్రొటోకాల్స్ మేరకు గంగూలీ అందరిలానే కరోనా పరీక్షలు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో సిడ్నీలో అడుగుపెట్టిన దాదా.. మంగళవారంతో తన క్వారంటైన్ పిరీయడ్ను పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన కరోనా పరీక్షల గురించి తెలియజేశాడు.
'నేను గత నాలుగున్నర నెలల్లో 22సార్లు టెస్ట్ చేయించుకున్నాను.. ఒక్కసారి కూడా పాజిటివ్గా రాలేదు. నా చుట్టూ ఉన్న పాజిటివ్ కేసులు ఉండటంతో నాకు నేరు పరీక్షించుకోవాల్సి వచ్చింది'అని గంగూలీ పేర్కొన్నారు. ఓ టెక్నాలజీ బ్రాండ్ నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
'నేను మా వృద్ధ తల్లిదండ్రులతో ఉంటాను. నేను దుబాయికి వెళ్లి వచ్చే క్రమంలో ఆరంభంలో ఆందోళన చెందా. నా కోసం మాత్రమే కాకుండా.. కమ్యూనిటీ, ప్రజలు గురించి తీవ్రంగా ఆలోచించా. వైరస్ను మరొకరికి వ్యాప్తి చేయాలనుకో లేదు' అని తెలిపాడు. భారత ఆటగాళ్లు ఫిట్గా ఉన్నారని, ఆస్ట్రేలియాలో ఎక్కువ కొవిడ్ కేసులు లేవని, దేశ సరిహద్దులు కొద్దికాలం పాటు మూసివేశారన్నారు.
అంతర్జాతీయ ప్రయాణాల విషయంలో కఠినంగా ఉన్నారని, 14 రోజుల కఠిన క్వారంటైన్ను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం క్రికెటర్లు మైదానంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఐపీఎల్ను విజయవంతంగా నిర్వహించినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపాడు. వచ్చే ఏడాది స్వదేశంలోనే టోర్నీ నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది సీజన్ను యూఏఈకి తరలించామని, బయోబబుల్లో 400 మంది ఉన్నారని తెలిపాడు. లీగ్ మొత్తంలో 30వేల నుంచి 40వేల టెస్టులు చేసినట్లు పేర్కొన్నాడు.