IND vs SA: రిషభ్ పంత్ సెంచరీ.. ధోనీ రికార్డు బద్దలు !

కేప్టౌన్: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ (139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 100 నాటౌట్) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్లో అజేయ సెంచరీతో చెలరేగిన పంత్.. సఫారీ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి ఆసియా వికెట్ కీపర్గా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు.

తొలి ఆసియా ప్లేయర్గా..
2010-11 సౌతాఫ్రికా పర్యటనలో మహేంద్ర సింగ్ ధోనీ సెంచూరియన్ వేదికగా 90 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్గా ఉండగా.. తాజాగా రిషభ్ పంత్ దాన్ని అధిగమించాడు. ధోనీనే కాకుండా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర(89), బంగ్లాదేశ్ ప్లేయర్ లిటన్ దాస్(70)ను కూడా వెనక్కినెట్టాడు. సంగక్కర 2002-03లో ఈ పరుగులు చేయగా.. లిటన్ దాస్ 2017-18లో సాధించాడు.

న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ చేస్తే..
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటికే సెంచరీలు బాదిన రిషభ్ పంత్ తాజాగా సౌతాఫ్రికాపై కూడా శతకం బాదాడు. ఒక్క న్యూజిలాండ్ గడ్డపై కూడా సెంచరీ చేస్తే సెనా దేశాల్లో సెంచరీ చేసిన ప్లేయర్గా గుర్తింపు పొందుతాడు. ఈ మ్యాచ్కు ముందు నిలకడలేమి ఫామ్, నిర్లక్ష్యపు షాట్లతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్.. తన ఆటతోనే సమాధానమిచ్చాడు. షాట్ సెలెక్షన్ మార్చుకోవాలని, దూకుడు తగ్గించుకోవాలని సీనియర్లు, సహచరులు, కోచ్లు చెప్పినా.. తన ఆటను ఇసుమంత కూడా మార్చుకునేది లేదని సెంచరీతో చాటి చెప్పాడు.

దూకుడుగా ఆడటంలో తగ్గేదేలే..
కేశవ్ మహరాజ్ బౌలింగ్లో అతను కొట్టిన మూడు సిక్స్లు ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచాయి. ఇందులో రెండు సిక్స్లు వరుసగా బాదాడు. అయితే మరో ఎండ్లో అతనికి సహకారం అందకపోవడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 198 పరుగులకే కుప్పకూలింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 13 పరుగుల ఆధిక్యంతో సౌతాఫ్రికా ముందు 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ తర్వాత విరాట్ కోహ్లీ(143 బంతుల్లో 4 ఫోర్లతో 29) టాప్ స్కోరర్గా నిలిచాడు.

బౌలర్లు చెలరేగితేనే..
సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ నాలుగు వికెట్లు తీయగా.. రబడా, లుంగి ఎంగిడి మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇక భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యం సౌతాఫ్రికాకు పెద్ద కష్టమేమి కాదు. గతంలో ఇదే వేదికపై భారత్ విధించిన 211 పరుగుల లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ మాదిరి పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని భారత బౌలర్లు అందిపుచ్చుకుంటే మాత్రం కోహ్లీసేన విజయం సాధించవచ్చు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications