మ్యాక్సీ ఒక్కడే..
అనంతరం ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. గ్లేన్ మ్యాక్స్వెల్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 35) మినహా అంతా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. రిషి ధావన్, రాహుల్ చాహర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హర్ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్కు తలో వికెట్ దక్కింది.
విరాట్ మళ్లీ విఫలం..
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 2 ఫోర్లు, సిక్సర్తో దూకుడు కనబర్చిన విరాట్ కోహ్లీ(20) దురదృష్టవశాత్తు రబడా బౌలింగ్లో క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. రిషి ధావన్ వేసిన ఆ మరుసటి ఓవర్లో కెప్టెన్ ఫాఫ్ డుప్లిస్(10) సైతం ఔటయ్యాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రార్ వచ్చి రావడంతో సిక్సర్ బాదాడు. కానీ అదే ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో ఆర్సీబీ 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
పటీదార్ వికెట్తో టర్నింగ్...
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్వెల్, రజత్ పటీదార్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ముఖ్యంగా మ్యాక్స్వెల్ తనదైన షాట్లతో చెలరేగాడు. అతనికి రజత్ పటీదార్ కూడా రాణించాడు. సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపట్టించాడు. కానీ క్రీజులో కుదురుకున్న ఈ జోడీని రాహుల్ చాహర్ విడదీసాడు. పటీదార్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఈ వికెట్ మ్యాచ్కే టర్నింగ్ పాయింట్గా నిలిచింది.
స్టన్నింగ్ క్యాచ్..
ఆ మరుసటి ఓవర్లోనే గ్లేన్ మ్యాక్స్వెల్ను హర్ప్రీత్ బ్రార్ పెవిలియన్ చేర్చగా.. ఎన్నో ఆశల మధ్య బరిలోకి దిగిన దినేశ్ కార్తీక్ను అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. దాంతో ఆర్సీబీ ఓటమి ఖాయమవ్వగా.. ఆ మరుసటి ఓవర్లో షెహ్బాజ్ అహ్మద్(9) రబడా క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వానిందు హసరంగా ఆడిన భారీ షాట్ను బౌండరీ లైన్ మీద హర్ప్రీత్ బ్రార్ అద్బుతంగా ఆదుకున్నాడు. క్యాచ్ అందుకోవడంతో పాటు 6 పరుగులు సేవ్ చేశాడు. బౌండరీ లైన్పై గాల్లోకి ఎగిరి బంతిని అందుకున్న హర్ప్రీత్ బ్రార్.. సమన్వయం కోల్పోతున్నానని భావించి గాల్లోకి విసిరేసి మళ్లీ వచ్చి అందుకున్నాడు. హర్షల్ పటేల్(11) ఔటైనా.. సిరాజ్, హజెల్ వుడ్ మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు.