9 రివ్యూలు వృథా!
2018 నుంచి తాజా ఇంగ్లండ్ సిరీస్ వరకు రవిచంద్రన్ అశ్విన్ 19 టెస్ట్ మ్యాచ్లు ఆడగా... అతని బౌలింగ్లో టీమిండియా 20 సమీక్షలు కోరింది. అందులో నాలుగు అంపైర్ల నిర్ణయానికి వ్యతిరేకంగా రాగా.. మరో ఐదు అంపైర్ కాల్స్గా ప్రకటించారు. ఇక 11 రివ్యూలు వృథా అయ్యాయి. ఇక ఇంగ్లండ్ సిరీసులో అశ్విన్ బౌలింగ్లో 10 సమీక్షలు కోరగా ఒకటి మాత్రమే సక్సెస్ అవ్వగా.. 9 విఫలమయ్యాయి. అందులో ఒకటి అంపైర్ కాల్ కావడం గమనార్హం. దీంతో డీఆర్ఎస్ విషయంలో అశ్విన్కు తొందరెక్కువ అనే విమర్శలను ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా డీఆర్ఎస్ వైఫల్యాలపై వివరణ ఇచ్చాడు.
క్రాష్ కోర్స్ చేయాలి..
'డీఆర్ఎస్ అంశంలో నన్ను చూసే తీరు మారాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవతలివారు చెప్పింది సరికాదేమో. ఇంగ్లండ్ సిరీస్కు ముందు నేను తీసుకున్న డీఆర్ఎస్లు చాలా బాగుండేవి. కానీ డీఆర్ఎస్లు తీసుకొనేటప్పుడు చాలా వరకు కీపర్పై ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే బంతి సరైన ప్రాంతంలో పడిందా? విసిరిన యాంగిల్ బాగుందా? వికెట్లను తాకగలదా? అనే విషయంలో కీపర్ సాయం అవసరం.
కానీ చాలా సందర్భాల్లో రిషభ్ పంత్ నన్ను నిరాశ పరిచాడు. (నవ్వుతూ)! అందుకే మేమిద్దరం డీఆర్ఎస్పై క్రాష్ కోర్సు చేయాలి. ఎందుకంటే రవి శాస్త్రి ఈ విషయంలో నాపై చాలా ఫిర్యాదులున్నాయి' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా డీఆర్ఎస్ల అంశంలో మెరుగవ్వాల్సిన అవసరమైతే ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో సమీక్షలు కోరేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
ఇలాంటి ప్రశ్నలకే నవ్వొస్తుంది..
లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ గురించి ప్రశ్నించగా.. తనకు దొరికిన ప్రతీ అవకాశాన్నీ గొప్పగా మలచుకుంటానని అశ్విన్ స్పష్టం చేశాడు. 'నేను ప్రశాంతంగా ఉన్నాను. నాతో నేనే పోటీ పడుతున్నాను. అందుకే తెలుపు బంతి క్రికెట్పై ప్రశ్నలు అడిగినప్పుడు నవ్వొస్తుంది. ఎందుకంటే నాకొచ్చిన ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకోవడమే నాకిష్టం.
వాటి పట్ల సంతోషంగా ఉన్నాను. అందుకే ఇతరుల అభిప్రాయలకు ఆందోళన చెందను. ఆడిన ప్రతీ మ్యాచ్లో నా ప్రదర్శనతో అవతలివారి ముఖంలో చిరునవ్వులు తెప్పించేందుకే ప్రయత్నిస్తాను' అని అశ్విన్ తెలిపాడు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ బాగా ఆడుతుండటంతో అశ్విన్కు అవకాశం ఇవ్వడం లేదని విరాట్ కోహ్లీ తెలిపిన సంగతి తెలిసిందే.