
చెన్నై: కరోనా వైరస్(కొవిడ్ 19) వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'జనతా కర్ఫ్యూ'కు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రజలు స్వీయ నిర్బంధంతో ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రధాని సూచించిన సూచనలను అందరూ ఫాలో అయ్యారు. సినీ, క్రీడా, రాజకీయ ఇలా ప్రతీ రంగం వారు జనతా కర్ఫ్యూకి మద్దతు ప్రకటించారు. ఇక స్టార్ క్రికెటర్లు తమదైన శైలిలో
తమ అభిమానులను ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోమని ట్విటర్లో సూచించారు.
ఈ 'జనతా కర్ఫ్యూ' దిగ్విజయమైన వేళ టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్లో స్పందించాడు. స్కూల్లో చెప్పినట్లు పిన్డ్రాప్ సైలెన్స్గా దేశమంతా ఉందన్నాడు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ.. సామాజిక దూరాన్ని పాటించాలని కోరాడు.
అనంతరం ఇంకో ట్వీట్ చేసిన ఈ సీనియర్ స్పిన్నర్.. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా మనమంతా ఒక టీమ్ అని పేర్కొన్నాడు. 'ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తరఫున మీరెప్పుడైనా ఆడాలని కలగంటే.. ఇప్పుడు మీకో అవకాశం దక్కింది' అనే క్యాప్షన్తో తన ఫొటోను షేర్ చేశాడు. ఈ ట్వీట్కు ముగ్దులైన అభిమానులు కామెంట్లు, షేర్లు చేస్తుండటంతో ఇది నెట్టింట వైరల్ అయింది.