
కొలంబో: సెలెక్టర్లు బెంచ్లు వేడెక్కేందుకు.. సెలువుల్లా ఎంజాయ్ చేసేందుకు ఆటగాళ్లను ఎంపిక చేయరని టీమిండియా బీ టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సత్తా ఉన్న ఆటగాళ్లకే జట్టులో చోటు దక్కుతుందని, ఏ క్షణం అవకాశం వచ్చినా రాణించేందుకు సిద్దంగా ఉంటారని తెలిపాడు. శ్రీలంకతో రెండో టీ20 ముందు భారత జట్టులో కరోనా కలకలం రేపడం, స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా పాజిటీవ్గా తేలడంతో జట్టులో ఏకంగా 9 మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృనాల్తో సన్నిహితంగా ఉన్న ప్రధాన ఆటగాళ్లంతా తదుపరి రెండు మ్యాచ్లకు దూరమయ్యారు. దాంతో భారత్ బెంచ్ ఆటగాళ్లతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ అనూహ్య సవాల్ను ఎలా అధిగమిస్తారని మ్యాచ్కు ముందు రాహుల్ ద్రవిడ్ను ప్రశ్నించగా.. జట్టులో ఉన్న ఆటగాళ్లంతా సత్తా ఉన్నవారేనని తెలిపాడు.'ఈ అనూహ్య పరిణామాలతో యువ ఆటగాళ్లు అవకాశం దక్కుతుంది. ఇప్పటికే యువ ఆటగాళ్లందికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించాం. వన్డే సిరీస్ గెలిచిన తర్వాత చివరి వన్డేలో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు చాన్స్ ఇచ్చాం.
భారత్కు సెలెక్ట్ అయ్యారంటేనే ఎంతో సత్తా ఉన్నట్లు అర్థం. తుది జట్టులో ఆడేందుకు సరిపోయేవాళ్లయితేనే సెలెక్టర్లు చాన్స్ ఇస్తారు. అంతేగానీ బెంచ్ వేడెక్కడానికి, సెలవుల్లా ఎంజాయ్ చేయడానికి ఆటగాళ్లను జట్టుతో పంపించరు. ఈ పర్యటనకు ఎంపికైన 20 మంది ఆటగాళ్లలో ప్రతి ఒక్కరు సత్తా చాటేవారే. అందరూ తమ సత్తా చాటేందుకే, ప్రతిభను చూపించుకునేందుకే వచ్చారు. అయితే ప్రతీసారి అందరికీ అవకాశం ఇవ్వడం కుదరదు. కానీ ఇక్కడ దాదాపు అందరికీ అవకాశం దక్కింది. 'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
కృనాల్తో సహా అతనికి సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, మనీశ్ పాండేలు ఈ మ్యాచ్తో పాటు చివరి మ్యాచ్కు దూరమయ్యారు. దాంతో భారత్ దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీశ్ రాణా నలుగురు అరంగేట్ర ఆటగాళ్లతో బరిలోకి దిగింది. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ దిగింది. శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్ శుభారంభం అందించినా.. పవర్ ప్లే అనంతరం లంక బౌలర్లు చెలరేగడంతో భారత్ బ్యాట్స్మన్ తడబడ్డారు. దాంతో 16 ఓవర్లలో భారత్ 3 వికెట్లకు 100 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్, నితీశ్ రాణా ఉన్నారు.