సిడ్నీ : అప్కమింగ్ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించాలంటే ఒక బ్యాట్స్మన్ 500కు పైగా పరుగులు చేయాలని, గత పర్యటనలో(2018-19) చతేశ్వర్ పుజారా చేశాడని భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. మరీ డిసెంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే తాజా సిరీస్లో ఆ బాధ్యతను ఎవరు తీసుకుంటారో చూడాలన్నాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడిన ద్రవిడ్.. అప్ కమింగ్ టెస్ట్ సిరీస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'లాస్ట్ టైమ్ పుజారా 500కు పైగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సారి కూడా సిరీస్ గెలవాలంటే ఓ బ్యాట్స్మన్ అలాంటి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈసారి ఇతర బ్యాట్స్మెన్ ఆ పరుగులు సాధిస్తారా? లేక మళ్లీ పుజారానే దానిని రిపీట్ చేస్తాడా అనేది చూడాలి. విరాట్ కోహ్లీ అయితే కాదు. ఎందుకంటే అతను సిరీస్ మొత్తం ఆడటం లేదు. కాబట్టి ఎవరో ఒకరు ఆ పరుగులు చేయాల్సిందే.
ఆస్ట్రేలియా పిచ్లపై భారత బౌలర్లు చెలరేగగలరు. ఆ నమ్మకం నాకుంది. ఐదు రోజుల్లో టీమిండియా బౌలర్లకు 20 వికెట్లు తీయడం కష్టం కాకపోవచ్చు. ఆసీస్ కూడా పేస్ బౌలర్లకు అనుకూలంగా ఉండే పిచ్లను రెడీ చేయవచ్చు. భారత జట్టులో కూడా నాణ్యమైన పేసర్లున్నారు.
ఇక బ్యాట్స్మెన్కు అలా వీలు పడదు. ప్రతీసారి ఒక సిరీస్లో బ్యాట్స్మన్కు 500 పరుగులు చేయడం సాధ్యం కాదు. కానీ బ్యాట్స్మన్ లయ అందుకుంటే బౌలర్లకు మాత్రం కష్టమే' అంటూ ద్రవిడ్ తెలిపాడు. ప్రస్తుతం ద్రవిడ్ ఎన్సీఏ క్రికెట్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.