|
అసలేం జరిగిందంటే..
పంజాబ్ బౌలర్ రిలే మెరిడిత్ వేసిన మూడో ఓవర్ చివరి బంతి నేరుగా పృథ్వీ షా జననాంగానికి తాకింది. గంటకు 141 కిలోమీటర్ల వేసిన ఆ బంతిని పృథ్వీ షా పుల్ చేయబోడు. కానీ బంతి మిస్సై నేరుగా అతనికి తాకరాని చోట తగిలింది. దాంతో కుప్పకూలిన పృథ్వీ షా నొప్పితో.. ఓ మై గాడ్ అంటూ మొకరిల్లాడు. పంజాబ్ ప్రధాన పేసర్ మహ్మద్ షమీ వచ్చి అతని గాయంపై ఆరా తీశాడు.
వెంటనే మైదానంలోకి ఫిజియోలు రాగా.. వారి సూచనల మేరకు ప్యాంట్లోకి చూసుకున్న పృథ్వీ షా ముసి ముసిగా నవ్వాడు. గాయం తీవ్రమైంది కాకపోవడంతో తన ఆటను కొనసాగించాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్దయ్యింది. ఆ ఓవర్కు ముందు షమీ బౌలింగ్లో షా వరుసగా 6, 4, 4 బౌండరీలు బాదాడు. 15 బంతుల్లో 22 రన్స్ చేసిన అతన్ని హర్ప్రీత్ బ్రార్ బౌల్డ్ చేశాడు.
ఢిల్లీ ఘన విజయం..
ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో టేబుల్ టాపర్గా నిలిచింది. ముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. తాత్కలిక కెప్టెన్ మయాంక్ అగర్వాల్(58 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లతో 99 నాటౌట్), డేవిడ్ మలాన్(26) మినహా అంతా విఫలమయ్యారు.
ఢిల్లీ బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ చెరొక వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 167 రన్స్ చేసి 14 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. శిఖర్ ధావన్(47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా పృథ్వీ షా(22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 39), షిమ్రాన్ హెట్మైర్(4 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 16 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో రిలే మెరిడిత్, క్రిస్ జోర్డాన్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ తీశారు.
జోరుమీదున్న షా..
గత సీజన్లో దారుణంగా విఫలమైన పృథ్వీ షా ఈ సీజన్లో మాత్రం చెలరేగుతున్నాడు. ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు బాదిన ఈ యువ ఓపెనర్.. విధ్వంసకర ఇన్నింగ్స్లతో ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 8 మ్యాచ్ల్లో 166.48 స్ట్రైక్రేట్తో 308 పరుగులు చేశాడు. 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్న షా.. ఓ సీజన్లో మూడు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. 2018,19, 20లో రెండేసి హాఫ్ సెంచరీలు చేశాడు. అతను ఇచ్చే మెరుపు ఆరంభాలతో ఢిల్లీ పని సులువవుతోంది.