
న్యూఢిల్లీ : ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతుండటంతో ఆటగాళ్లను రిటెన్షన్పై ఫ్రాంచైజీలన్నీ తర్జనభర్జన పడుతున్నాయి. ఎవరిని కొనసాగించాలో.. ఎవరిని వదిలేయాలన్న సమీకరణాల్ని లోతుగా విశ్లేషించుకుంటున్నాయి. రిటెన్షన్ జాబితా సమర్పించేందుకు నేడే(మంగళవారమే) తుది గడువు కావడంతో క్రికెటర్ల ఎంపికపై తుది కసరత్తు చేస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల్లోపు రిటెన్షన్ జాబితాలను అందజేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) డెడ్లైన్ విధించింది. రాత్రి 9.30 గంటలకు ఈ రిటెన్షన్ వివరాలను బీసీసీఐ ప్రకటించనుంది.
అయితే ఐపీఎల్లో ఇదే చివరి వేలామా? మళ్లీ ఆక్షన్ ఉండదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. 'బంపర్ అనౌన్స్మెంట్.. ఇదే చివరి ఐపీఎల్ మెగా ఆక్షన్' అంటూ కే శ్రీనివాస్ రావు అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. 'ఇదే చివరి మెగా వేలం. దీని తర్వాత ఫ్రాంఛైజీలు తమకంటూ సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటాయని భావిస్తున్నా. వేలం అనేది పాత పద్ధతి.. దానికి కాలం చెల్లింది.
కాబట్టి ఇకపై మెగా వేలం ఉండబోదని అనుకుంటున్నా'' అని పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అయితే.. నిజంగా ఇదే చివరి మెగా వేలం కానుందా అనే అనుమానం కూడా చాలా మందిలో మొదలైంది. బిగ్బాష్ మాదిరి డ్రాఫ్ట్ సిస్టమ్ ఉంటే ఐపీఎల్కు మేలే జరుగుతుందని, నేరుగా ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చంటున్నారు. ఇదే నిజమైతే.. కొత్త ఫ్రాంఛైజీలతో సహా 8 పాత ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియపై మరింత దృష్టిసారిస్తాయి.
బీసీసీఐ రూపొందించిన రిటెన్షన్ రూల్స్ ప్రకారం పాత ఫ్రాంచైజీలు గరిష్టంగా నలుగురి ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరేసి భారత ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. లేదా ముగ్గురు భారత్, ఒక్కరు విదేశీ ప్లేయర్ను తీసుకోవచ్చు. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ ఇద్దరిని మించకూడదు. జీత భత్యాల్లో కూడా రూల్స్ పాటించాలి.
నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ప్లేయర్కు రూ. 12 కోట్లు, మూడో ప్లేయర్కు రూ. 8 కోట్లు, నాలుగో ప్లేయర్కు రూ.6 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఫ్రాంచైజీలు రూ.90 కోట్ల తమ పర్స్ వాల్యూ నుంచి రూ.42 కోట్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మిగిలిన ఆటగాళ్ల నుంచి కొత్త జట్లు 'పిక్ అప్' ఆప్షన్ కింద గరిష్టంగా ముగ్గురిని ఎంచుకోవచ్చు.