న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్లో చెత్తగా ఆడిన ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్లో బలంగా తిరిగిరావాలని చూస్తోంది. ఇందుకోసం తమ టీమ్లో అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్లకు ఇంగ్లండ్లో మూడు వారాల పాటు ప్రత్యేక ట్రెయినింగ్ ఇప్పించనుంది. జులైలో జరిగే ట్రిప్ కోసం హైదరాబాద్ క్రికెటర్లు తిలక్ వర్మ, బుద్ది రాహుల్తో పాటు కుమార్ కార్తికేయ, రమణ్దీప్ సింగ్, హృతిక్ షోకీన్ తదితరులను ఎంపిక చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న అర్జున్ టెండూల్కర్, సౌతాఫ్రికా యువ ప్లేయర్ డెవాల్డ్ బ్రేవిస్ కూడా ఈ ట్రైనింగ్ క్యాంప్లో కలవనున్నారు.
ఇంగ్లండ్లోని అగ్రశ్రేణి టీ20 క్లబ్లతో మ్యాచ్లు ఆడేందుకు వీలుగా ఫ్రాంఛైజీ ఏర్పాట్లు చేస్తోంది. అక్కడి టాప్ కౌంటీ క్లబ్తో పోటీ పడేందుకు వీలుగా సుమారు 10 టీ20 మ్యాచ్లు ఆడించనున్నట్లు సమాచారం. ఈ ట్రైనింగ్ క్యాంప్కు సంబంధించిన వివరాలను ముంబై ఇండియన్స్కు చెందిన ఓ అధికారి ఎన్డీటీవీకి తెలిపారు.'తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, రమణ్దీప్ సింగ్, హృతిక్ షోకీన్ తదితర యువ క్రికెటర్లకు టాప్ టీ20 క్లబ్లతో పోటీ పడే అవకాశం ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఇప్పటికే అర్జున్ టెండుల్కర్ యూకే చేరుకున్నాడు. ఇక సౌతాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ సైతం వీరితో కలవనున్నాడు'అని సదరు అధికారి పేర్కొన్నారు.
భారత్కు చెందిన అన్క్యాప్డ్ ప్లేయర్లను మాత్రమే ఈ క్యాంప్నకు తీసుకువెళ్తున్నామని.. ఇది కమర్షియల్ టూర్ కాదని.. కాబట్టి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఐపీఎల్లో తిరుగులేని జట్టుగా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఇటీవల ముగిసిన సీజన్లో మాత్రం దారుణంగా విఫలమైంది. వరుసగా 8 మ్యాచ్ల్లో ఓటమిపాలై అందరికన్నా ముందే టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఓవరాల్గా 14 మ్యాచ్ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగుస్థానంలో నిలిచింది. అయితే, అరంగేట్ర ఆటగాళ్లు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్ మాత్రం రాణించారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఈ సీజన్లో 397 పరుగులు చేసి ముంబై తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు.
ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల జాబితా:
తిలక్ వర్మ, కుమార్ కార్తికేయ, హృతిక్ షోకేన్, మయాంక్ మార్కండే, రాహుల్ బుద్ధి, రమణ్దీప్ సింగ్, అన్మోల్ప్రీత్ సింగ్, బాసిల్ థంపి, మురుగన్ అశ్విన్, ఆర్యన్ జుయాల్, ఆకాశ్ మెధ్వాల్, అర్షద్ ఖాన్, అర్జున్ టెండుల్కర్, డెవాల్డ్ బ్రెవిస్.