
న్యూఢిల్లీ: టీమిండియా దిగ్గజ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పేరుకే సౌతాఫ్రికా టీ20 లీగ్ అయినాత.. ఈ టోర్నీలోని జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో సౌతాఫ్రికా టీ20 లీగ్ తొలి సీజన్ ప్రారంభించేందుకు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) కసరత్తులు చేస్తోంది.
టోర్నీలో మొత్తం ఆరు జట్లు ఉండగా.. కేప్టౌన్ను-ముంబై ఇండియన్స్, జోహన్నెస్బర్గ్- చెన్నై సూపర్ కింగ్స్, డర్బన్- లక్నో సూపర్ జెయింట్స్, పోర్ట్ ఎలిజిబెత్- ఎస్ఆర్హెచ్, ప్రిటోరియా-ఢిల్లీ క్యాపిటల్స్, పార్ల్- రాజస్తాన్ రాయల్స్ దక్కించకున్నాయి. అయితే సీఎస్కేకు చెందిన జోహన్నెస్బర్గ్ జట్టును ధోనీ నడిపించనున్నాడనేది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సీఎస్కే జట్టుతో ఉన్న ధోనీకి ఉన్న అనుబంధం నేపథ్యంలో తొలి సీజన్లో అతను బరిలోకి దిగనున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై సీఎస్కే యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కేలో కొనసాగిన ధోనీ జట్టును నాలుగుసార్లు విజేతగా(2010, 2011,2018, 2021).. మరో ఐదుసార్లు రన్నరప్గా(2008,2012,2013,2015,2019) నిలిపాడు. 2010, 2014లో ధోనీ సీఎస్కేకు చాంపియన్స్ లీగ్ టీ20 టైటిల్స్ అందించాడు.
గత ఐపీఎల్ సీజన్లో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. కానీ అంచనాలకు భిన్నంగా అతను దారుణంగా విఫలమవడంతో మళ్లీ ధోనీనే జట్టు పగ్గాలను అందుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 14 మ్యాచ్ల్లో 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో సీఎస్కే తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2022 సీజన్ ధోనీకి ఆఖరిదని అంతా భావించినప్పటికి.. ఆ వార్తలను ఖండించిన అతను తర్వాతి సీజన్లోనూ ఆడనున్నట్లు స్పష్టం చేశాడు. చెన్నై అభిమానుల మధ్యే ఆటకు వీడ్కోలు పలుకుతానని తెలిపాడు.