పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి ప్రస్తుతం అత్యంత అగమ్యగోచరంగా మారింది. పాక్ జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించిన పాకిస్థాన్ ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. కనీసం బంగ్లాదేశ్ పర్యటనలోనైనా తన పరువు నిలబెట్టుకుంటుందని ఆశించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిపోవడమే కాకుండా సిరీస్ను 2-1తో కోల్పోయింది. ఈ పరాజయం పాకిస్థాన్ క్రికెట్ ప్రపంచంలో పెద్ద దుమారాన్నే రేపింది.
కమ్రాన్ అక్మల్ షాకింగ్ కామెంట్స్
ఈ ఓటమిపై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అత్యంత ఘాటుగా స్పందించారు. ఓ ప్రముఖ టీవీ షోలో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పాక్ ఆడుతున్న క్రికెట్ చూస్తుంటే అది ఆటలా అనిపించడం లేదని.. ఓ కామెడీ సీరియల్లా కనిపిస్తోందని ఎద్దేవా చేశాడు. అభిమానులు ఈ ఆటను చూసి సీరియస్ కావాల్సిన అవసరం లేదని.. కేవలం ఓ వినోదంగా భావించి నవ్వుకోవాలని అక్మల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. తాము కూడా ఈ ఓటములకు అలవాటు పడిపోయామని.. అందుకే ఇప్పుడు బాధపడటం మానేసి ఎంజాయ్ చేస్తున్నామని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.

తీవ్రస్థాయిలో విరుచుకుపడిన దిగ్గజం
పాక్ జట్టు యాజమాన్యం, సెలెక్టర్ల తీరుపై కమ్రాన్ అక్మల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ముఖ్యం జట్టు యాజమాన్యానికి దేశం గెలుపు కంటే ప్రయోగాలు చేయడమే ముఖ్యమనిపిస్తోందని విమర్శించారు. "ఈ యాజమాన్యానికి మూడు మ్యాచ్ల సిరీస్కు 30 మంది ఆటగాళ్లను ఇచ్చినా, అందరినీ మార్చి మార్చి ఆడించేస్తారు తప్ప స్థిరమైన జట్టును తయారు చేయరు" అని మండిపడ్డాడు. గెలుపుపై కనీస బాధ్యత లేని ఇలాంటి ప్రయోగాలు జట్టును సర్వనాశనం చేస్తున్నాయని అక్మల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
పాక్ క్రికెట్ మనుగడ కష్టమే..
ర్యాంకింగ్స్లో వెనుకబడి ఉన్న జట్ల చేతిలో ఓడిపోవడం పాకిస్థాన్కు అవమానకరమని.. ఐసీసీ ర్యాంకింగ్స్లో 10వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ కోల్పోవడాన్ని కమ్రాన్ అక్మల్ జీర్ణించుకోలేకపోయాడు. గత 7-8 ఏళ్లుగా పాకిస్థాన్ క్రికెట్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించాడు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని, లేదంటే పాక్ క్రికెట్ మనుగడ కష్టమని హెచ్చరించాడు.
మ్యాచ్ సాగిందిలా..
సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో వన్డే విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు భారీ స్కోరు సాధించింది. అనంతరం 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, ఆరంభంలో బాగానే ఆడినా చివరికి ఒత్తిడికి లోనైంది. 50 ఓవర్లు ముగిసేసరికి 279 పరుగులకే ఆలౌట్ అయ్యి 11 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో పాక్ క్రికెట్ వర్గాల్లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత కూడా పాక్ జట్టులో ఎలాంటి మార్పు రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.