రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీకి బైక్లన్నా, జంతువులన్నా భలే ఇష్టపడుతుంటాడు. తనకు నచ్చిన అన్నింటినీ తన ఫామ్ హౌస్కు తెచ్చుకుంటాడు. ఈ మధ్య కాలంలో ఓ గుర్రంను పెంచుకుంటున్న ధోనీ.. ఈ ఖాళీ సమయాన్ని దాంతో ఆస్వాదిస్తున్నాడు. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ఈ జార్ఖండ్ డైనమైట్ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే వయసు పై బడినా.. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైనా తన ఫిట్నెస్ ఏ మాత్రం తగ్గలేదని మహీ మరోసారి నిరూపించాడు.
తన ఫామ్ హౌస్లోని గుర్రంతో పోటీపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ సతీమణి సాక్షి సింగ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ధోనీతో పరుగుపందెం ఎవరు గెలవలేరని ఒకరంటే.. ఎవడ్రా ధోనీకి వయసు అయిపోయిందన్నదని మరొకరు ప్రశ్నిస్తున్నారు. ఇక గతనెల ఓ చిన్న గుర్రానికి మసాజ్, స్నానం చేయించిన ధోనీ.. తాజాగా మరో చిన్న గుర్రంతో ఆటలాడాడు.
గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాక యూఏఈలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై సారథిగా కొనసాగాడు. అయితే, అప్పుడా జట్టు సరిగ్గా ఆడకపోవడంతో ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఈసారి సగం టోర్నీ పూర్తయ్యేసరికి చెన్నై ఏడు మ్యాచ్ల్లో 5 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఉద్ధృతి కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ధోనీ తిరిగి ఇంటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఫామ్హౌజ్లో పెంచుకుంటున్న మూగజీవాలతో సరదాగా గడిపేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నాడు. ఐపీఎల్ రీస్టార్ట్తో మహీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇక బ్యాటింగ్లో తన మెరుపులను ఈ జార్ఖండ్ డైనమైట్ బాకీ ఉన్నాడు.