పేసర్లు ఏమంటున్నారంటే..?
ఈ వ్యవహారంపై భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇండియాటుడే సలామ్ క్రికెట్ కార్యక్రమంలో చర్చించారు. చెమటకు బదులు ఉమ్మినే ఎందుకువాడుతామనే కారణాన్ని వెల్లడించారు. ‘బంతి బరువు పెరిగేందుకు, మృదువుగా చేయడానికి మాత్రమే చెమట ఉపయోగపడుతుంది. కానీ రివర్స్ స్వింగ్ రాబట్టాలంటే మాత్రం ఉమ్మిని వాడాల్సిందే. అది బంతిని గట్టిగా చేయడంతో పాటు మెరుపు తెచ్చి రివర్స్ స్వింగ్ అయ్యేలా చేస్తుంది. కానీ ఇప్పుడు ఉమ్మిని వాడవద్దంటున్నారు. ఇది మాకు పెద్ద సవాలే.'అని షమీ తెలిపాడు.
బౌలర్లకు అనుకూలంగా పిచ్లు..
ఇక ఉమ్మిలా, చెమట ప్రభావం చూపదని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. ఉమ్మిని నిషేధిస్తే పిచ్లను బౌలర్లకు అనుకూలంగా మార్చాలని కోరాడు. ‘ఈ నిర్ణయం ఆటపై ఎంత ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఉమ్మి వాడకుంటే బంతి.. గాలిని అంతగా కట్చేయలేదు. ముఖ్యంగా రివర్స్ స్వింగ్ విషయంలో ఉమ్మిలా చెమట ప్రభావం చూపలేదు. టెస్ట్ క్రికెట్పై దీని ప్రభావం ఎక్కువగా పడనుంది. కాబట్టి ఐసీసీ బాధ్యత తీసుకొని బౌలర్లకు అనుకూలంగా పిచ్లు తయారు చేసేలా చూడాలి. లేకుంటే ఆట బ్యాట్స్మన్కు అనుకూలంగా మారిపోతుంది'అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.
సుశాంత్ హెలికాప్టర్ షాట్ చూసి ధోనీ ఏమన్నాడో తెలుసా?
స్పిన్నర్ల సమస్య ఏంటంటే..?
ఇక ఐసీసీ నిర్ణయంపై స్పిన్నర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కార్యక్రమంలో ఈ అంశంపై భారత స్పిన్నర్లు యుజ్వేంద్ర చహల్, కుల్దీయాదవ్లు మాట్లాడారు.‘ఐసీసీ నిర్ణయం బౌలర్లకు ప్రతికూలంగా మారనుంది. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో ఉమ్మితోనే మెరుపు తీసుకొచ్చి బంతిని డ్రిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు దాన్ని నిషేధిస్తే మాకు ఇబ్బంది అవుతుంది. బంతి డ్రిప్ట్ చేయకపోతే.. మేం ఎలాంటి ప్రభావం చూపలేం. ఈ సమస్యకు మాకు ఓ పరిష్కారం కావాలి.'అని చహల్ చెప్పుకొచ్చాడు.
పట్టు చిక్కదు..
బంతిని డ్రిప్ట్ చేయలేకపోతే.. బ్యాట్స్మన్ను అడ్డుకోలేమని కుల్దీప్ ఆందోళన వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్లలో నెట్టుకొచ్చినా.. టెస్ట్ల్లో మాత్రం కష్టమని ఈ చైనామన్ బౌలర్ అభిప్రాయపడ్డాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
బంతి మెరుపు పెంచకుంటే స్పిన్ చేయలేమన్నాడు. చెమటతో బంతి బరువును పెంచవచ్చని, కానీ పట్టుచిక్కించుకోలేమని చెప్పాడు. ఇది బౌలర్లకు సమస్యగానే మారనుందని, బంతి కొత్తగా ఉన్నప్పుడే చెమటతో మెరుపు వస్తుందని, పాత బంతి అయితే దాని ప్రభావమే ఉండదని భజ్జీ చెప్పుకొచ్చాడు.
బంతిని మార్చాలంటున్న సచిన్..
ఈ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న సచిన్.. అంపైర్లకు ఓ మైనం బాక్స్ ఇవ్వాలని సూచించాడు. అలా కాదనుకుంటే 45-50 ఓవర్ల తర్వాత బంతిని కచ్చితంగా మార్చాలన్నాడు. ‘ఉమ్మి నిషేధం అనేది బౌలర్లకు వందశాతం ఎదురుదెబ్బే. అయితే టెస్ట్లకు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లు తయారు చేస్తే బౌలర్లకు కాస్త ఉపశమనం కలుగుతుంది. బౌలింగ్ పిచ్లు అయితే ఒక్క బాల్ సరిపోతుంది. లేదంటే బాల్ను మార్చాల్సిందే. బాల్ మార్పు విషయంలో ప్రత్యర్థి జట్టు అభిప్రాయానికి అనుగుణంగా వెళ్లాలి' అని మాస్టర్ వ్యాఖ్యానించాడు.