అహ్మదాబాద్: చెత్త బ్యాటింగే భారత్ చేతిలో ఘోర పరాజయానికి కారణమని న్యూజిలాండ్ తాత్కలిక కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నాడు. పవర్ప్లేలోనే ఐదు వికెట్లు కోల్పోవడం తమ ఓటమిని శాసించిందన్నాడు. బుధవారం ఏకపక్షంగా సాగిన చివరి టీ20లో సమష్టిగా విఫలమైన న్యూజిలాండ్ 168 పరుగుల భారీ తేడాతో భారత్ చేతిలో ఓటమి చవిచూసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత భారీ తేడాతో ఓడిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మిచెల్ సాంట్నర్.. భారత జట్టును ప్రశంసించాడు. అసాధారణమైన ఆటతో అద్భుతమైన విజయాన్నందుకుందని కొనియాడాడు.
'ఈ ఓటమి తీవ్రంగా నిరాశపరిచింది. టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజార్చుకున్నాం. కానీ భారత్ అసాధారణ ఆటతో ఆకట్టుకుంది. కొందరు భారత ఆటగాళ్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయినప్పుడు మ్యాచ్ గెలవడం కష్టం. స్వింగ్ అవుతున్న బాల్ను ఆడటం కూడా కష్టమే. భారత్ ఆరంభంలో ఓపికగా ఆడింది. ఆ తర్వాత వికెట్ ఫ్లాట్గా మారడంతో పరుగులు రాబట్టింది. ఆరంభంలో మేం కూడా కాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. డ్యూ ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా ముందుగా బౌలింగ్ చేస్తారు. వన్డే ప్రపంచకప్ ముందు ఈ సిరీస్ మాకు గొప్ప అనుభవం. ఇక్కడ కొన్ని మంచి వికెట్లను చూశాం. అక్టోబర్లో జరిగే ప్రపంచకప్ మరింత రసవత్తరంగా ఉండనుంది.'అని మిచెల్ సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 126 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. రాహుల్ త్రిపాఠి(44), హార్దిక్ పాండ్యా(30) మెరుపులు మెరిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్వేల్, టిక్నర్, సోదీ, డారిల్ మిచెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 12.1 ఓవర్లలో 66 పరుగులకు కుప్పకూలింది. డారిల్ మిచెల్(35), మిచెల్ సాంట్నర్(13) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా(4/16) నాలుగు వికెట్లతో చెలరేగగా.. ఉమ్రాన్ మాలిక్(2/9), అర్ష్దీప్ సింగ్ 2(2/16), శివమ్ మావి(2/12) రెండేసి వికెట్లు తీసారు.