ధోనీ లాంటి ప్లేయర్ టీమిండియాకు అవసరం
తాజాగా యూట్యూబ్ షోలో తొలి వన్డే మ్యాచ్పై మైకేల్ హోల్డింగ్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. 'భారీ స్కోరు ఛేదన అంటే భారత్కు క్లిష్టమే. జట్టులో ఎంఎస్ ధోనీ లేకపోవడం టీమిండియాకు కష్టంగా మారింది. సగం మంది పెవిలియన్కు చేరిన అనంతరం మహీ క్రీజులోకి వచ్చినా ఛేదనను నియంత్రణలోకి తీసుకొస్తాడు. గతంలో ధోనీ జట్టులో ఉన్నప్పుడు భారత్ గొప్ప విజయాలు సాధించింది. ప్రస్తుత టీమిండియా బ్యాటింగ్ లైనప్ పటిష్టంగానే ఉంది. కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన స్ట్రోక్ప్లే కలిగి ఉన్నారు. హార్దిక్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. కానీ కోహ్లీ సేనకు ధోనీ వంటి ప్లేయర్ అవసరం. మహీ నైపుణ్యమే కాదు, జట్టులో అతడి పాత్రా ఎంతో కీలకం' అని హోల్డింగ్ అన్నాడు.
లక్ష్య ఛేదనలో ధోనీ స్పెషల్ మ్యాన్
'అంతేగాక ఎంఎస్ ధోనీ జట్టులో ఉంటే టాస్ గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ధోనీ సామర్థ్యం అందరికీ తెలుసు. ఛేదనలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు కంగారు పడటం మనం ఎన్నడూ చూడలేదు. లక్ష్యాన్ని ఎలా సాధించాలో అతడికి బాగా తెలుసు. తనతో పాటు క్రీజులో ఉండే ఆటగాడికి అతడు సలహాలు ఇస్తూ సాయం చేస్తుంటాడు. కాగా భారత్కు ప్రస్తుతం గొప్ప బ్యాటింగ్ దళం ఉన్నా లక్ష్య ఛేదనలో ధోనీ స్పెషల్ మ్యాన్' అని మైకేల్ హోల్డింగ్ చెప్పాడు.
పేలవ ఫీల్డింగ్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ పేలవ ఫీల్డింగ్ చేసిందని, ఎన్నో అవకాశాలు చేజార్చుకుందని వెస్టిండీస్ మాజీ పేస్ బౌలర్ మైకేల్ హోల్డింగ్ అన్నాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ క్యాచ్లు జారవిడవడంతో పాటు రనౌట్ చేసే అవకాశాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా భారత్, ఆసీస్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. హోల్డింగ్ విండీస్ తరఫున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 249, వన్డేల్లో 142 వికెట్లు పడగొట్టాడు.