ద్రవిడే ఒప్పించాడు..
అయితే ఈ మెగాటోర్నీలో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ ఆడకుండా రాహుల్ ద్రవిడే ఒప్పించాడని నాటి టీ20 వరల్డ్కప్ విన్నింగ్ టీమ్ మేనేజర్ కమ్ కోచ్ లాల్చంద్ రాజ్పుత్ తాజాగా వెల్లడించాడు. ‘స్పోర్ట్స్ కీదా' నిర్వహించిన ఫేస్బుక్ లైవ్ సెషన్లో మాట్లాడుతూ.. 2007 టీ20 ప్రపంచకప్ నాటి క్షణాలను నెమరువేసుకున్నాడు.‘అవును.. ఇది నిజం. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను 2007 టీ20 ప్రపంచకప్ ఆడకుండా ద్రవిడే ఒప్పించాడు. అప్పుడు ద్రవిడ్ కెప్టెన్గా ఉండగా.. టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. దీంతో కొంత మంది ఆటగాళ్లు నేరుగా ఇంగ్లండ్ వచ్చారు. టీ20 ప్రపంచకప్ కోసం అక్కడి నుంచే జోహన్నస్ బర్గ్ వెళ్లుదామని అనుకున్నారు. కానీ ఈ పొట్టి ప్రపంచకప్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
పశ్చాత్తాపానికి గురయ్యారు..
కానీ యువ భారత్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఎందుకు ఆడలేదా? అని పశ్చాతాపం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆడుతున్నా.. ఒక్క ప్రపంచకప్ గెలవలేకపోయానని సచిన్ నాతో తరుచూ అనేవాడు. చివరకు 2011 గెలిచినా.. దాని కోసం అతను చాలా శ్రమించాడు. అయితే యువ జట్టు మాత్రం తొలి ప్రయత్నంలోనే సాధించింది'అని లాల్ చంద్ గుర్తు చేసుకున్నాడు.
ఒత్తిడి లేకపోవడంతో..
ఇక ఆ టోర్నీ సమయంలో జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్లో సానుకూల వాతావరణం నెలకొందన్నాడు. ‘2007 టీ20 ప్రపంచకప్ జట్టుకు నేనే మేనేజర్. యువ జట్టు కావడంతో అది నాకు పెద్ద సవాల్లా అనిపించింది. కొంత మందే అనుభవమైన ఆటగాళ్లు ఉండగా.. మిగతావారంతా కొత్తవాళ్లే. సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉన్నారు. వాస్తవానికి అది మాకు దక్కిన గొప్ప అవకాశం. కోచ్గా నాకు, కెప్టెన్గా ధోనీకి అదే తొలిసారి. కానీ మేం బాగా కలిసిపోయాం. ఇక జట్టు డ్రెస్సింగ్ రూమ్లో మంచి వాతావరణం నెలకొంది. ఇక ఆటగాళ్లలో స్పూర్తి నింపినప్పుడు వారు ఒత్తిడిగా భావించలేదు. టెన్షన్ తీసుకోవద్దు అనే తరహానే మా ప్రపంచకప్ ప్రయాణం సాగింది. కేవలం మా బలంపై విశ్వాసం ఉంచాం. ఇతర విషయాలు గురించి అస్సలు పట్టించుకోలేదు.
ఆటగాళ్ల కసే...
ఇక ఈ ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ పట్ల ఉన్న దృక్పథాన్నే మార్చేసింది. మేం ఈ టోర్నీలో పాల్గొనేటప్పుడు ఏ ఒక్కరూ కూడా మేం చాంపియన్లు అవుతామని అంచనావేయలేదు. ఇక టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ప్రాక్టీస్ చేసింది కూడా ఏం లేదు. అప్పటి వరకు మేం ఆడింది ఒకే ఒక టీ20 మ్యాచ్. ఇతర జట్లు ఈ మెగాటోర్నీ కోసం మాకన్నా చాలా మ్యాచ్లు ఆడాయి. ప్రాక్టీస్ చేసాయి. మేం అంతగా ప్రణాళికలు కూడా రచించలేదు. కానీ మా ఆటగాళ్లలో కసి మాత్రం ఉంది. తొలి ప్రపంచకప్ ఆడుతున్నామనే భావన, అద్భుత ప్రదర్శనతో మంచి పేరుతేచ్చుకోవాలనే యువ ఆటగాళ్ల తపన, జట్టులో ప్లేస్ను పదిలం చేసుకోవాలనే సీనియర్ ఆటగాళ్ల కోరికనే మమ్మల్ని విజేతగా నిలిపింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉండటం కూడా కలిసి వచ్చింది.'అని లాల్చంత్ తెలిపాడు.