హైదరాబాద్: న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో దారుణంగా విఫలమైన భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫిట్నెస్పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భుజ గాయంతోనే అతను కివీస్ పర్యటనకు వెళ్లినట్లు ఓ న్యూస్ వెబ్సైట్ పేర్కొంది.
అందుకే ఐదు టీ20ల సిరీస్ల నేపథ్యంలో టీమ్మేనేజ్మెంట్ నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో కుల్దీప్ పాల్గొనలేదని తెలిపింది. తొలి టీ20కు ముందు జనవరి 23న నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో, మూడో టీ20 ముందు జనవరి 28న జరిగిన ప్రాక్టీస్లో కుల్దీప్ బౌలింగ్ చేయలేదని, ఇదే అతని గాయంపై వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయని స్ఫష్టం చేసింది. టీ20 సిరీస్ సందర్భంగా ఓ కామెంటేటర్ కుల్దీప్తో ముచ్చటించగా.. జట్టులోకి రావడానికి ఒక వారం సమయం పడుతుందని కుల్దీప్ సదరు కామెంటేటర్ తెలిపినట్లు తమ కథనంలో రాసుకొచ్చింది.
గాయం నేపథ్యంలోనే ఐదు టీ20ల సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదని, ఫిట్నెస్ లేకున్నా తొలి వన్డేలో బరిలోకి దిగడంతో కుల్దీప్ మూల్యం చెల్లించుకున్నాడని పేర్కొంది. ఇక, ఈ మ్యాచ్లో భారత చైనామన్ బౌలర్ను ఆతిథ్య బ్యాట్స్మెన్ ఓ ఆటాడుకున్న విషయం తెలిసిందే.
మొత్తంగా 10 ఓవర్లు వేసిన కుల్దీప్ రెండు వికెట్లు తీసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో భారత స్పిన్నర్గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తన 60 మ్యాచ్ల వన్డే కెరీర్లో అత్యంత దారుణ పెర్ఫామెన్స్తో మరిచిపోలేని దినంగా మిగుల్చుకున్నాడు. మరి ఫిట్నెస్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించే భారత టీమ్మేనేజ్మెంట్ కుల్దీప్ విషయంలో మాత్రం చూసి చూడనట్లుగా ఎందుకు వ్యవహరించిందో? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో శనివారం జరిగే రెండో వన్డేలో కుల్దీప్ అవకాశం కల్పిస్తారా? లేక పక్కనపెడ్తారా? అనే విషయంపై కూడా తీవ్ర చర్చనడుస్తోంది.