ముంబై: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడు, ఆంధ్ర క్రికెటర్ కేఎస్ భరత్ అజేయ సెంచరీతో చెలరేగాడు. హిమాచల్ ప్రదేశ్తో జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్లో 109 బంతుల్లో 14 ఫోర్లు, 8 సిక్స్లతో అజేయంగా 161 పరుగులు చేశాడు. తనదైన బ్యాటింగ్తో హిమాచల్ బౌలర్లను చితక్కొట్టాడు. దాంతో ఈ మ్యాచ్లో ఆంధ్ర జట్టు 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసింది. కేఎస్ భరత్తో పాటు అశ్విన్ హెబ్బర్(132 బంతుల్లో 10 ఫోర్లతో 100) సెంచరీతో రాణించాడు. చివర్లో అంబటి రాయుడు (14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34) విలువైన పరుగులు చేశాడు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన హిమాచల్ ప్రదేశ్.. 46 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిషీ ధావన్(79) మినహా అంతా విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లో గిరినాథ్ రెడ్డి 4 వికెట్లతో రాణించాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీ ఐపీఎల్ స్టార్లు పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఈ దేశవాళీ టోర్నీలో ఐపీఎల్ 2021 ఆరెంజ్ క్యాప్ హోల్డర్, మహారాష్ట్ర ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్(సీఎస్కే) ఇప్పటికే హ్యాట్రిక్ సెంచరీలతో ఆకాశమే హద్దుగా చెలరేగుతుండగా.. కేకేఆర్ విధ్వంసకర ఆటగాడు, మధ్యప్రదేశ్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ రెండు సూపర్ శతకాలతో శివాలెత్తాడు. తాజాగా ఆర్సీబీ మాజీ ఆటగాడు కేఎస్ భరత్ కూడా ఆ జాబితాలో చేరాడు.
గత ఐపీఎల్ వేలంలో కనీస ధర రూ.20 లక్షలు మాత్రమే పలికిన భరత్(ఆర్సీబీ).. తాజా ప్రదర్శనతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో జాక్పాట్ కొట్టనున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడే అవకాశాన్ని అందుకున్న భరత్.. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన రసవత్తర పోరులో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టుకు విజయాన్నందించాడు. ఆ ఒక్క మ్యాచ్తో హీరోగా మారిపోయాడు. వికెట్కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన భరత్.. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో సాహా గైర్హాజరీలో టీమిండియా తాత్కాలిక వికెట్ కీపర్గా బాధ్యతలు చేపట్టి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలోనే మెగా వేలంలో అతను భారీ ధర పలికే అవకాశం ఉంది.