ముంబై: ఐపీఎల్ 2020 సీజన్ ముగిసిన అనంతరం భారత్కు చేరిన ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు నిర్బంధించిన విషయం తెలిసిందే. సరైన ధ్రువ పత్రాలు లేని బంగారం, ఇతర విలువైన వస్తువులు కలిగి ఉండటంతో కృనాల్ను విమానాశ్రయంలోనే ఆపివేశారు. ఐపీఎల్-2020 చాంపియన్ ముంబై జట్టు సభ్యుడైన అతను గురువారం యూఏఈ నుంచి వచ్చాడు. పరిమితికి మించి బంగారం ఉండటంతో పాటు ఇన్వాయిస్ లేని వస్తువులు కొనుగోలు చేయడంతో నిర్బంధించినట్లు డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. సుమారు రూ. కోటి విలువ చేసే వస్తువులను కృనాల్ తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి.
అయితే కస్టమ్స్ నిబంధనలపై అవగాహన లేకనే ఇలా జరిగిందని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని మంబై ఎయిర్ పోర్ట్ అధికారులకు కృనాల్ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వస్తువులకు సంబంధించిన పెనాల్టీని కడతానని కూడా డీఆర్ఐ అధికారులకు ఈ ముంబై ఆల్రౌండర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు డీఆర్ఐ ప్రమాణాల ప్రకారం ఇది చాలా చిన్న కేసు అని అధికారులు తెలిపారు.
మంగళవారం రాత్రి దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఏకంగా ఐదుసార్లు టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ విన్నింగ్ టీమ్ సభ్యుడైన కృనాల్.. జట్టుతోనే భారత్కు చేరుకున్నాడు. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సోదరుడైన కృనాల్ పాండ్యా.. ఎడమచేతి వాటం బ్యాట్స్మన్, స్పిన్ బౌలర్గా రాణిస్తున్నాడు. భారత్ తరపున 18 టీ20లు ఆడిన కృనాల్.. ఐపీఎల్లో 71 మ్యాచ్లు ఆడాడు.
IPL 2020లో ఆ ఆరుగురు బ్యాట్స్మెన్ ది బెస్ట్: ఆకాశ్ చోప్రా