
హైదరాబాద్: ప్రస్తుత తరంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తెలిపాడు. ఐపీఎల్లో తన సహచర ఆటగాడైన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్తో తాజాగా ఈ కివీస్ కెప్టెన్ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లలో ఆధిపత్యం చెలాయించేందుకు కోహ్లీ చాలా ఆకలితో ఉన్నాడని, ఇప్పటికే అతను ఎన్నో రికార్డులను నెలకొల్పాడని చెప్పుకొచ్చాడు. కోహ్లీ, డివిలియర్స్లో ఎవరు ఉత్తమ బ్యాట్స్మెన్ అనే విషయాన్ని తేల్చి చెప్పలేమని కేన్ పేర్కొన్నాడు.
'ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోవడం కష్టం. ఏబీ డివిలియర్స్ కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, అతను చాలా మంచి బ్యాట్స్మెన్. ఈ కాలంలో ఉన్న ప్రత్యేకమైన ఆటగాళ్లలో అతను మొదటిస్థానంలో ఉంటాడు. ఇక కోహ్లీ విషయానికొస్తే.. అతనికి పరుగులు చేయడం అంటే ఇష్టం. అతని ఆట చూడటంలో ఎంతో ఆనందం ఉంటుంది. ప్రత్యర్థిగా ఆడతున్న సమయంలో అతని నుంచి ఎంతో నేర్చుకోవచ్చు'అని విలియమ్సన్ అభిప్రాయపడ్డాడు.
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నెంబర్ 2గా ఉన్న కోహ్లీ.. వన్డేలో మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 ఫార్మాట్లో 10వ స్థానంలో నిలిచాడు. ఇక న్యూజిలాండ్ తరఫున ఇప్పటి వరకు 80 టెస్ట్లు ఆడిన విలియమ్సన్ 50.99 సగటుతో 6476 పరుగులు చేశాడు. ఇక 151 వన్డేల్లో 13 సెంచరీలు, 39 హాఫ్సెంచరీలతో 6173 పరుగులు సాధించాడు.
ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో వివాదస్పద నిబంధనల కారణంగా టైటిల్ చేజారినా.. ఎలాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించకుండా అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. రూల్స్ను గౌరవిస్తూ అతను చాటిన క్రీడా స్పూర్తికి యావత్ క్రికెట్ ప్రపంచం సలాం చేసింది.