లండన్: కరోనా కకలావికలంతో ఆటలన్నీ ఆగమాగమయ్యాయి. కొన్ని టోర్నీలు రద్దవ్వగా.. మరికొన్ని వాయిదాపడ్డాయి. ఇంకొన్ని జరుగుతాయో లేవోననే అనుమానాలు నెలకొన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్కు కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఈ క్యాష్ రిచ్ లీగ్.. కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. కానీ దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు.. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా బాధితుల నేపథ్యంలో ఈ మెగాటోర్నీ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు ఆందోళనకు గురవుతున్నారు. కాసులు కురిపించే ఐపీఎల్ రద్దయితే తాము ఆర్థికంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్మన్ జోస్ బట్లర్.. ఐపీఎల్ రద్దయితే మాత్రం సిగ్గు చేటని వ్యాఖ్యానించాడు. తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోతో మాట్లాడుతూ.. స్థాయి పరంగా ఐపీఎల్ చాలా పెద్దదని బట్లర్ తెలిపాడు. కొవిడ్-19 మహమ్మారి వల్ల టోర్నీ జరకపోవడం బాధకరమని పేర్కొన్నాడు. ఈ ఏడాదే మరో సమయంలోనైనా ఐపీఎల్ను నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
'ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుందో నా కన్నా మీకే బాగా తెలుసు. టోర్నీని వెనక్కి జరుపుతారా? అని ప్రజలు అడుగుతున్నారు. ప్రస్తుత పరిస్థితి ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియదు. అందుకే టోర్నీ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడైతే నిర్ణయించలేరు. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ. క్రికెట్కు అత్యంత కీలకం. ఏడాది చివర్లోనైనా ఐపీఎల్ జరక్కపోతే సిగ్గుచేటు. వెనక్కి జరపడం వల్ల కొందరు ఆటగాళ్లు అందుబాటులో ఉండరన్నది నిజమే. పరిస్థితులను బట్టి వారు నడుచుకోవాలి' అని బట్లర్ చెప్పుకొచ్చాడు. ఇక ఐపీఎల్లో బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.
కొవిడ్-19తో భారత్లో 100కు పైగా మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా 80వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉండటంతో దాదాపు సగం దేశాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి.