అన్నీ చర్చిస్తారా?
యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 లేక 10 వరకు నిర్వహించాలనుకున్న ఐపీఎల్కు అనుసరించాల్సిన సమగ్ర విధి విధానాల (ఎస్ఓపీ)పై పాలక మండలి తుది నిర్ణయం తీసుకోనుంది. దుబాయ్కు వెళ్లిన దగ్గరి నుంచి తిరిగి స్వదేశం చేరేదాకా చేయాల్సినవి... చేయకూడనివి అన్నీ కూలంకశంగా చర్చిస్తారు. ఒక్కో ఫ్రాంచైజీలో వెళ్లే ఆటగాళ్ల సంఖ్య, ఆడే మ్యాచ్లు... ఉండే పరిమితులు, ఏర్పాటు చేసే బుడగ, దాటితే వచ్చే సమస్యలు ఇలా ఒకటి రెండు కాదు... అన్నింటికీ సమాధానాలు ఈ సమావేశంలోనే వెల్లడవుతాయి.
పర్మీషన్ కోసం వెయిటింగ్..
కరోనా వాయిదా వేసినా... వరల్డ్కప్ వాయిదాతో కలిసొచ్చిన కాలంతో ఐపీఎల్కు రంగం సిద్ధమవుతోంది. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చకచకా పనులు చక్కబెడుతున్నప్పటికీ భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కావాల్సిందే. యూఏఈలో నిర్వహించేందుకు, అక్కడికి భారత ఆటగాళ్లను, సిబ్బందిని చార్టెడ్ ఫ్లయిట్లలో తరలించేందుకు సర్కారు అనుమతి కావాలి. ఇప్పటికైతే కేంద్రం స్పందించలేదు. అయితే కరోనా ప్రొటోకాల్ పాటిస్తే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత ఉండదు. అందుకే ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
గంగూలీ, జైషా..
నేడు జరిగే సమావేశంలో బోర్డు అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షాలతో పాటు కోశాధికారి అరుణ్ ధుమాల్, ఐపీఎల్ జీసీ సభ్యులు, ఫ్రాంచైజీ యజమానులు పాల్గొంటారు. ‘ఆదివారం పాలక మండలి సమావేశం జరుగబోతోంది. అయితే మేమంతా యూఏఈలో ఈ లీగ్ను జరిపేందుకు కేంద్ర హోం, విదేశాంగ శాఖల నుంచి అనుమతి కోసం చూస్తున్నాం' అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఇదీ అజెండా..
ఇంతకుముందు జరిగిన మూడు పాలక మండలి సమావేశాల మినిట్స్ను ఆమోదించడం. అలాగే టోర్నీని 51 రోజుల పాటు జరపాలా? లేక దీపావళి సందర్భంగా మరో రెండు రోజులు ముందుకు జరిపి నవంబరు 10న ఫైనల్ను ఆడించాలా? అనేది తేల్చనున్నారు. టైటిల్ లోగో స్పాన్సరర్ వివో ఏడాదికి రూ.440 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు భారత్, చైనా మధ్య ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో వివోతో ఎలా ముందుకెళ్లాలో ఆలోచించనున్నారు.
అయినా ఇప్పటికిప్పుడు మరో స్పాన్సరర్ రావడం కష్టమనే అభిప్రాయంలో ఐపీఎల్ పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా ఎస్ఓపీపై 240 పేజీల డాక్యుమెంట్ను తయారుచేశారు. దీన్ని ఫ్రాంచైజీలతో పంచుకోవాల్సి ఉంది. దీంట్లో ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నిసార్లు కొవిడ్ టెస్టులు జరపాలి, బయో బబుల్ను ఎలా రూపొందించాలి? అనే ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. అలాగే ఈ మ్యాచ్ల కోసం పాలక మండలి సభ్యులు వెళ్లడంపై కూడా చర్చించనున్నారు.