జడేజా విఫలమవ్వడంతో..
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలోనే ధోనీ సూచనలతో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన చెన్నై మేనేజ్మెంట్ మూల్యం చెల్లించుకుంది. సారథిగా ఏ మాత్రం అనుభవం లేని జడేజా తీవ్ర ఒత్తిడికి లోనై తడబడ్డాడు. కెప్టెన్సీ వల్ల అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బ తిన్నది. దాంతో అతని కెప్టెన్సీ పై వేటు వేసిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మళ్లీ ధోనీకే సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ధోనీ ఈ ఏడాదికి మించి ఆడలేని పరిస్థితి ఉండటంతో అతని వారుసుడిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తదుపరి కెప్టెన్గా రుతురాజ్..
ఐపీఎల్ 2021 సీజన్లో ఒంటి చేత్తో జట్టుకు టైటిల్ అందించిన రుతురాజ్ గైక్వాడ్ను సీఎస్కే తదుపరి కెప్టెన్గా ఎంపిక చేయాలని ఆ టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2021లో 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్.. ఐపీఎల్ 2022లో మాత్రం విఫలమయ్యాడు. అయితే దేశవాళీ క్రికెట్లో అతను నిలకడగా రాణించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు.. శుక్రవారం ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపాడు.
దేశవాళీ క్రికెట్లో..
మహారాష్ట్ర కెప్టెన్గా జట్టును తొలి సారి ఫైనల్కు చేర్చాడు. సౌరాష్ట్రతో జరిగిన టైటిల్ ఫైట్లోనూ టీమ్ అంతా విఫలమైన వేళ.. ఒక్కడే సెంచరీతో జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. దురదృష్టవశాత్తు టైటిల్ అందుకోకపోయినా.. తాను కెప్టెన్ చేయగలననే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఐదు ఇన్నింగ్స్ల్లో 4 సెంచరీలతో 660 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. అత్యధిక స్కోర్ 220 నాటౌట్. తన బ్యాటింగ్తో మహారాష్ట్రను రుతురాజ్ ఒంటి చేత్తో ఫైనల్ చేర్చాడు.
మైక్ హస్సీ సైతం..
ఈ ప్రదర్శనతో సీఎస్కే కెప్టెన్సీకి రుతురాజ్ గైక్వాడ్ పేరును సీఎస్కే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీమ్ సీఈవోతో పాటు కోచ్లు కూడా రుతురాజ్ నియమాకాన్ని సుముఖంగా ఉన్నారని, మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అతనే సీఎస్కే తదుపరి కెప్టెన్ అని ఆ జట్టు వర్గాలు పేర్కొన్నాయి. సీఎస్కే మాజీ బ్యాటర్ మైక్ హస్సీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. సీఎస్కే తదుపరి కెప్టెన్గా రుతురాజ్ సరిగ్గా సరిపోతాడని పేర్కొన్నాడు. ధోనీలానే ప్రశాంతంగా ఉంటూ... గేమ్ను బాగా అర్థం చేసుకుంటాడని, అతని దగ్గర అద్భుతమైన సారథ్య స్కిల్స్ ఉన్నాయని చెప్పాడు.