
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాడ్ ఫేజ్ను ఉద్దేశించి పంజాబ్ కింగ్స్ ఆసక్తికర పోస్ట్ చేసింది. పంజాబ్ కింగ్స్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 54 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసింది. అయితే ఈ మ్యాచ్లో కూడా విరాట్ కోహ్లీని దురదృష్టం వెంటాడింది. 2 ఫోర్లు, ఓ భారీ సిక్సర్తో దూకుడుగా ఆడిన విరాట్..చివరకు విధిరాతకు బలయ్యాడు. కగిసో రబడా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఏమాత్రం ఊహించని రీతిలో పెవిలియన్ చేరాడు.
ఆ ఓవర్ రెండో బంతిని కగిసో రబడా షార్ట్ పిచ్గా వేయగా.. విరాట్ ఫుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే ఆ స్లోయర్ బంతిని అంచనా వేయడంలో విరాట్ విఫలమయ్యాడు. దాంతో బంతి అతని డొక్కలో తాకి గాల్లోకి లేచి షార్ట్ ఫైన్ లెగ్లో ఉన్న రాహుల్ చాహర్ చేతిలో పడింది.
దాంతో పంజాబ్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరాడు. విరాట్ మాత్రం ఔట్ కాదని, డొక్కలో తాకిందని సైగ చేస్తూ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. కానీ రిప్లేలో బంతి బ్యాట్ను మిస్సై అతని గ్లోవ్స్ను ముద్దాడినట్లు కనిపించింది. స్నీకో మీటర్లో గీత రావడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఇక ఇలా ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ఆకాశం వైపు చూస్తూ ఆ దేవుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 'ఓ దేవుడా.. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది.'అని గట్టిగా అరుస్తూ మైదానం వీడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. విరాట్ కోహ్లీ అభిమానులు విచారం వ్యక్తం చేసారు.
పంజాబ్ టీమ్ సైతం తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కోహ్లీ ఆకాశంవైపు చూస్తున్న ఫొటోను పంచుకొని ఓ పోస్టు చేసింది. అందులో.. తాము కాసేపు కోహ్లీ వికెట్ ఆస్వాదించామని కూడా చెప్పింది. అయితే, ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న అతను త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, విరాట్ కోహ్లీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్ల్లో 19.67 సగటుతో 236 పరుగులే చేశాడు. అందులో ఒకే ఒక్క అర్ధశతకం సాధించాడు.