హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్లో చాంపియన్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నైసూపర్ కింగ్స్ నిరాశజనక ప్రదర్శన కనబర్చాయి. రెండు జట్లు వరుస ఓటములతో అందరికన్నా ముందే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొని ఇంటిదారిపట్టాయి. అయితే ఈ పేలవ ప్రదర్శనతో ఈ రెండు చాంపియన్ టీమ్స్ తమ పేరిట చెత్త రికార్డును లిఖించుకున్నాయి. ఈ సీజన్లో సీఎస్కే, ముంబై పదేసి పరాజయాలను చవిచూసాయి. ఇలా ఓ సీజన్లో ఈ రెండు జట్లు పది మ్యాచ్ల్లో ఓడిపోవడం ఇదే తొలిసారి. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ సీజన్లో కూడా చెన్నై, ముంబై ఇంత దారుణమైన ప్రదర్శన కనబర్చలేదు.
IPL 2022: Mumbai Indians and CSK Create Worst Record
— uppala shivaprasad (@shivauppala93) May 21, 2022
For 1st time, Lost 10 matches in an IPL Season #CSKvsRR #MIvsDC #IPL2022
ఐదు సార్లు చాంపియన్ అయిన ముంబై వరుసగా 8 పరాజయాలతో చెత్త ఇప్పటికే ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది.15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా వరుసగా ఇన్ని మ్యాచ్లు ఓడిపోలేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన ముంబై.. మూడు మ్యాచ్ల్లో గెలిచి 10 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్తో నేడు(శనివారం) జరిగే మ్యాచ్లో గెలిచి లీగ్ను ఘనంగా ముగించాలని ఆ జట్టు భావిస్తోంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్ల్లో 10 పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్(23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 40 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. మోయిన్ అలీ(57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్లతో 93) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. అనంతరం రాజస్థాన్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 151 రన్స్ చేసింది. యశస్వీ జైస్వాల్(44 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 59), అశ్విన్ రాణించారు.