న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2021 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. మినీ వేలానికి ముందు తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను వదులుకుంది. ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ మేరకు స్మిత్కు తమ అధికారిక ట్విటర్లో ధన్యవాదాలు తెలిపింది. ఫిబ్రవరి రెండో వారంలో ఐపీఎల్ 2021 సీజన్కు సంబంధించిన మినీ వేలం జరిగే సూచనలు కన్పిస్తుండగా.. జనవరి 21(గురువారం) లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ప్లేయర్ల జాబితాను సమర్పించాలని అన్ని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది.
ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ను రిలీజ్ చేస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. స్మితే కాకుండా ఓ వీడియో ట్వీట్తో వదులుకునే ఆటగాళ్ల జాబితాపై హింట్ ఇచ్చింది. ఈ జాబితాలో డేవిడ్ మిల్లర్, ఆండ్రూ టై, మనన్ వొహ్రా, రాహుల్ తెవాటియాలున్నారు. అయితే గత సీజన్లో రాహుల్ తెవాటియా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పేపర్పై బలంగా కనిపించిన రాజస్థాన్ జట్టు.. గత సీజన్లో ఆశించిన ఆటతీరు కనబర్చలేకపోయింది. పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
ఇక 2008లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. 2018లో స్టీవ్ స్మిత్ను కెప్టెన్గా ప్రకటించింది. కానీ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా స్మిత్ ఐపీఎల్కు దూరం కావడంతో.. అంజిక్యా రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2019లో స్మిత్ తిరిగి జట్టులో చేరినప్పటికీ.. కెప్టెన్గా రహానే వ్యవహరించాడు.
2020 సీజన్కు ముందు రాజస్థాన్ స్మిత్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. 2020 సీజన్ ఆరంభంలో అద్భుతంగా ఆడిన స్మిత్ తర్వాత తేలిపోయాడు. 14 మ్యాచ్ల్లో కలిపి 311 రన్స్ మాత్రమే చేశాడు. అందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్మిత్ 2017లో అత్యధికంగా 472 రన్స్ చేశాడు. దాంతో రాజస్థాన్ కెప్టెన్ను మార్చాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు బహిరంగంగానే స్మిత్ను విమర్శించారు.