న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ మరోసారి దుమ్ములేపారు. పటిష్ట బౌలింగ్ లైనప్ కలిగిన ముంబై బౌలర్లను చెడుగుడు ఆడారు. బౌలర్ ఎవరా? అనేది సంబంధం లేకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. దాంతో ముంబై ముందు సీఎస్కే 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అంబటి రాయుడు (27 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్లతో 72 నాటౌట్), ఫాఫ్ డూప్లెసిస్(28 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50), మోయిన్ అలీ(36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్లతో 58),పరుగుల విధ్వంసం సృష్టించడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 రన్స్ చేసింది. ఈ ఇన్నింగ్స్ మొత్తం 16 సిక్సర్లు నమోదయ్యాయి. 13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబైపై చెన్నైకి ఇదే అత్యధిక స్కోర్. చెన్నై బ్యాట్స్మన్ ధాటికి జస్ప్రీత్ బుమ్రా (1/56) చెత్త రికార్డును నమోదు చేశాడు. తన కెరీర్లోనే ఇన్ని పరుగులు ఇవ్వలేదు. పొలార్డ్ (2/12) మినహా మిగతా బౌలర్లంతా చేతులెత్తేశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నైకి ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. గత మ్యాచ్ హాఫ్ సెంచరీ హీరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ ఓవర్లోనే క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మోయిన్ అలీ, మరో ఓపెనర్ ఫాఫ్ డూప్లెసిస్తో కలిసి ధాటిగా ఆడాడు. ఈ జోడీ వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 49 రన్స్ చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన మొయిన్ అలీ సిక్సర్లతో విరుచుకపడ్డాడు.
ఈ క్రమంలో 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో చెన్నై 10.1 ఓవర్లోనే 100 పరుగులు చేసింది. అయితే బుమ్రా వేసిన అదే ఓవర్ ఐదో బంతికి మోయిన్ అలీ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో సెకండ్ వికెట్కు నమోదైన 108 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ మరుసటి ఓవర్లోనే డూప్లెసిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ అదే ఓవర్ ఐదో బంతికి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు.
ఆ మరుసటి బంతికే సురేశ్ రైనా(2) ఔటవ్వడంతో ముంబై కమ్ బ్యాక్ చేసినట్లు కనిపించింది. కానీ క్రీజులోకి వచ్చిన జడేజా(22 నాటౌట్) సాయంతో అంబటి రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ హైదరాబాదీ స్టార్.. 7 సిక్సర్లు 4 ఫోర్లతో వీరవిహారం చేశాడు. దాంతో చెన్నై 218 పరుగుల భారీ స్కోర్ చేసింది.