బీబీఎల్లో అదరగొట్టి..
పెర్త్ స్కార్చర్స్తో జరిగిన ఫైనల్లో జేమ్స్ విన్స్ అదరగొట్టాడు. 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 90 పరుగులు చేసి టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. బీబీఎల్ 10 సీజన్లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. 16 మ్యాచ్ల్లో 38.35 సగటుతో 537 పరుగులు చేశాడు.
అత్యధిక వ్యక్తిగత స్కోర్ 98 నాటౌట్. ఈ మ్యాచ్లో కూడా సెంచరీ చేసుకునేవాడే. కానీ ప్రత్యర్థి బౌలర్ క్రీడా స్పూర్తికి విరుద్దంగా వైడ్ వేయడంతో జేమ్స్ విన్స్ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. టోర్నీ మొత్తం 59 బౌండరీలు, 11 సిక్స్లతో 143.58 స్ట్రైక్రేట్ దుమ్ములేపాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. దాంతో ఈ ఫించ్ హిట్టర్ బ్యాట్స్మెన్ తీసుకోవడానికి మూడు ఫ్రాంచైజీలు ప్రణాళికలు రచిస్తున్నారు.
రేసులో చెన్నై సూపర్ కింగ్స్..
గత సీజన్లో పూర్తి నిరాశజనక ప్రదర్శన కనబర్చిన చెన్నై ఈ సారి రాణించాలనే పట్టుదలతో సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే సురేశ్ రైనాను రిటైన్ చేసుకున్న ఆ జట్టు ఇప్పుడు.. రిటైర్మెంట్ ప్రకటించిన షేన్ వాట్సన్ స్థానంలో మరో ఓవర్సీస్ ప్లేయర్ను తీసుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. బ్యాటింగ్ వైఫల్యంతో గత సీజన్లో విఫలమైన చెన్నై.. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఈ కమ్రంలో ఖాళీ అయిన వాట్సన్ స్థానంలో జేమ్స్ విన్స్ను తీసుకోవాలని భావిస్తోంది. ఫాఫ్ డూప్లెసిస్కు అతను సరైన జోడిగా నిలుస్తాడని ఆశిస్తోంది.
కోహ్లీసేన కూడా..
విరాట్ కోహ్లీ నేతృత్వంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ఓ ఓవర్సీస్ ప్లేయర్పై కన్నేసింది. ఆరోన్ ఫించ్ను వదిలేసిన ఆ జట్టు.. అతని స్థానంలో ఓ మంచి టాపార్డర్ బ్యాట్స్మెన్ తీసుకోవాలనుకుంటుంది. జట్టు పూర్తిగా విరాట్ కోహ్లీ, డివిలియర్స్పై ఆధారపడుతుండటంతో ఆ సమస్యను అధిగమించేందుకు కోచ్ సైమన్ కటిచ్తో పాటు డైరెక్టర్ మైక్ హెస్సెన్ ప్రణాళికలు రచిస్తున్నారు. విన్స్ తీసుకుంటే టాపార్డర్ బలం పెరుగుతుందని భావిస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ సైతం..
రాజస్థాన్ రాయల్స్లో మూడు ఓవర్సీస్ ప్లేయర్స్ స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్నే వదులుకుంది. దాంతో రూ. 35.85 కోట్ల డబ్బుంది. స్మిత్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ఆ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. బ్యాటింగ్ బలం పెంచుకునేందుకు విన్స్ తీసుకోవాలని భావిస్తోంది. ఇక ఈ సీజన్ మినీ వేలానికి 1097 ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా మినీ వేలం జరగనుంది.