ఆ ప్లాన్తోనే SRHను బోల్తా కొట్టించా.. నేను అస్సలు భయపడలేదు: వరుణ్ చక్రవర్తీ
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలో ఎదురైన వైఫల్యాలకు తాను భయపడలేదని కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ స్పష్టం చేశాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే పిచ్లపై రాణించడం స్పిన్నర్లకు కష్టమని, టోర్నీ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపుతారనే విషయం తనకు తెలుసున్నాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన కేకేఆర్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తీ(3/36) మూడు వికెట్లతో సన్రైజర్స్ పతనాన్ని శాసించాడు. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కనబర్చిన అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
నా గాయం పర్వాలేదు..
ఈ సందర్భంగా మాట్లాడిన వరుణ్ చక్రవర్తీ.. తన బౌలింగ్ ప్రణాళికల గురించి పంచుకున్నాడు. ప్రత్యేకమైన ప్లాన్తో సన్రైజర్స్ బ్యాటర్లను బోల్తా కొట్టించానని చెప్పాడు. 'ఇప్పుడేం పర్వాలేదు(గాయంపై). అది కేవలం దెబ్బ తగిలినప్పుడు వచ్చిన నొప్పి మాత్రమే. నేను ఇంకా నా పాదాన్ని పూర్తిగా కింద పెట్టలేకపోతున్నాను. కానీ మరో 3 రోజుల్లో అంతా సెట్ అవుతోంది. అతను ఆ బంతిని చాలా వేగంగా కొట్టాడు. నేను దానిని ఆపాల్సి వచ్చింది. లేకపోతే అది ఫోర్ వెళ్ళేది.

నేను ప్రతి సంవత్సరం ఇదే చెబుతున్నాను. ఐపీఎల్ ఆరంభంలో మొదటి నాలుగు మ్యాచ్లు ఫ్లాట్ వికెట్లుగా ఉంటాయి. అప్పుడు స్పిన్నర్లు రాణించడం చాలా కష్టం. ఇది ప్రతి స్పిన్నర్కూ జరిగింది. ప్రతి ఒక్కరూ దీనిని కష్టంగా భావించారు. టోర్నమెంట్ ముందుకు సాగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపుతారు.
ఆ ప్లాన్తోనే ట్రావిస్ హెడ్ను ఔట్ చేశా..
ట్రావిస్ హెడ్ తన చేతులను బాగా చాచి ఆడుతున్నాడు. నేను అతన్ని అలా ఆడనివ్వకూడదు అనుకున్నాను. నాకున్న సాధారణ ప్రణాళిక అదే. జట్టులో ఆటగాళ్లందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. మా బ్యాటింగ్ విభాగం ఒక జట్టుగా రాణిస్తోంది. బ్యాటింగ్ విభాగం ఈ విధంగా మ్యాచ్ను ముగించడం చూడటానికి చాలా బాగుంది. జట్టులో చాలా సానుకూల శక్తి వచ్చింది. మేం ఇదే రీతిలో ముందుకు సాగితే.. ఈ ఐపీఎల్లో ఖచ్చితంగా పెద్ద ముద్ర వేయగలం.'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.
వరుణ్ తీన్మార్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఇషాన్ కిషన్(29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 42)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/36) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్(2/31), కార్తీక్ త్యాగీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, కామెరూన్ గ్రీన్, అనుకుల్ రాయ్ తలో వికెట్ తీసారు.
అనంతరం కేకేఆర్ ఓవర్లలో 2 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అంగ్క్రిష్ రఘువంశీ(47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 59)హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ అజింక్యా రహానే(36 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 43) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్, సకీబ్ హుస్సేన్, శివాంగ్ కుమార్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications