IPL 2026: కొంపముంచిన స్టోయినీస్.. గెలిచే మ్యాచ్లో ఓడిన పంజాబ్ కింగ్స్!
ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్కు మరో పరాజయం ఎదురైంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. వాషింగ్టన్ సుందర్ అద్భుత బ్యాటింగ్తో గుజరాత్ టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు మార్కస్ స్టోయినీస్ పంజాబ్ కింగ్స్ కొంపముంచాడు. ఆఖరి ఓవర్లో 12 పరుగులను డిఫెండ్ చేయలేకపోయాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. సూర్యాన్ష్ షెద్గే(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40), మార్కో జాన్సెన్(11 బంతుల్లో ఫోర్, సిక్స్తో 20) విలువైన పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్(4/24) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, కగిసో రబడా రెండేసి వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసాడు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసి గెలుపొందింది. సాయి సుదర్శన్(41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 57) హాఫ్ సెంచరీతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్(23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో విజయ్కుమార్ వైశాఖ్(2/30), అర్ష్దీప్ సింగ్(2/24) రెండేసి వికెట్లు తీయగా.. మార్కోజాన్సెన్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు. గుజరాత్ టైటాన్స్కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. పంజాబ్ కింగ్స్కు రెండో పరాజయం.
కొంపముంచిన స్టోయినీస్..
18వ ఓవర్ను బార్ట్లెట్, 19వ ఓవర్ను అర్ష్దీప్ సింగ్ కట్టుదిట్టంగా వేయడంతో ఆఖరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో కొత్త బ్యాటర్ అర్షద్ ఖాన్ ఉండటంతో పంజాబ్ కింగ్స్ శిభిరంలో ఆశలు చిగురించాయి. కానీ ఆఖరి ఓవర్ వేసిన మార్కస్ స్టోయినీస్ తొలి బంతినే వైడ్ వేసి ఒక పరుగు అప్పనంగా ఇచ్చాడు. తర్వాతి బంతిని అర్షద్ ఖాన్ బౌండరీ బాది మూమెంటమ్ను గుజరాత్ వైపు తిప్పాడు. తర్వాతి మూడు బంతుల్లో 3 పరుగులే రావడంతో చివరి రెండు బంతులకు 3 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతిని ఎదుర్కొన్న వాషింగ్టన్ సుందర్ సిక్సర్ బాది మ్యాచ్ను ముగించాడు.
బ్యాటింగ్ వైఫలమ్యే..
పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడం పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తీవ్ర ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు. దాంతో పంజాబ్ 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ యువ బ్యాటర్ సుర్యాన్ష్ షెద్డే అద్వితీయమైన హాఫ్ సెంచరీతో పంజాబ్ కింగ్స్ను ఆదుకున్నాడు. 6వ వికెట్కు 79 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించాడు. అతని బ్యాటింగ్తో పంజాబ్ కింగ్స్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. మరో 10-20 పరుగులు చేసి ఉంటే ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచేది. జాసన్ హోల్డర్ 4 వికెట్లతో పంజాబ్ కింగ్స్ పతనాన్ని శాసించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications