— Simran (@CowCorner9) November 9, 2020 |
ఇంతకేం జరిగిందంటే..?
టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అనంతరం హోస్ట్ మార్క్ నికోలస్తో తమ గేమ్ స్ట్రాటజీ, మార్పుల గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో జట్టులోకి వచ్చిన ఆటగాళ్ల పేర్లు మరిచిపోయాడు. రెండు మార్పులు చేసామన్న అయ్యర్.. పృథ్వీషా స్థానంలో ప్రవీణ్ దూబే జట్టులోకి వచ్చాడని చెప్పాడు. అలాగే డానియల్ సామ్స్ స్థానంలో ఎవరు వచ్చారో మరిచిపోయాడు. కొద్ది సేపు అతను ఏం చెప్పకుండా ఎవరా? అని ఆలోచించసాగాడు. పక్కనే ఉన్న హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. హెట్మైర్ అని చెప్పడంతో అవునంటూ అతని పేరు చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. అయితే ఆఖరి క్షణంలో మార్పులు చేయడంతోనే అయ్యర్ గందరగోళానికి గురైనట్లు తెలిసింది.
మా వ్యూహం పని చేసింది...
ఫైనల్ చేరుకున్నందుకు అద్భుతంగా అనిపించిందని మ్యాచ్ అనంతరం అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. సీజన్లో తమ ప్రయాణం ఒడిదొడుకుల మధ్య సాగిందని పేర్కొన్నాడు. ‘మా జట్టంతా ఓ కుటుంబం. ప్రతి ఒక్కరు శ్రమించిన తీరుకు సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం నాకెన్నో పాఠాలు నేర్పించింది. సారథిగా ఎన్నో బాధ్యతలు చూసుకున్నా.
కోచ్లు, సహాయక సిబ్బంది నుంచి నాకెంతో సాయం లభించింది. అంతేకాకుండా చక్కని జట్టు ఉండటం నా అదృష్టం. కొన్నిసార్లు జట్టులో మార్పులు తప్పవు. ముంబై కఠినమైన జట్టు. దానిపైనా స్వేచ్ఛగా ఆడాలనే అనుకుంటున్నా. హైదరాబాద్లో రషీద్ కీలకమని తెలుసు. అతడికి వికెట్లు ఇవ్వకుండా ఆడాలనుకున్నాం. పవర్ప్లేలో మెరుపు ఆరంభం కావాలనే ఉద్దేశంతో స్టాయినిస్ను పంపించాం. అతడు ఎక్కువసేపు ఆడితే పరుగులు వస్తాయని భావించాం' అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
స్టోయినిస్ సూపర్ షో..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధసెంచరీ సాధించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' స్టొయినిస్ (27 బంతుల్లో 38; 3 ఫోర్లు, సిక్స్), హెట్మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. తర్వాత లక్ష్యఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసి ఓడింది. కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్లు) పరువు నిలిపే పోరాటం చేశాడు. స్టొయినిస్ (3/26), రబడ (4/29) హైదరాబాద్ను దెబ్బ తీశారు.