కెప్టెన్సీ నుంచి తప్పించడం సరికాదు..
విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడం పరిష్కారం కాదని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. తాజాగా క్రిక్ బజ్తో మాట్లాడిన సెహ్వాగ్.. కోహ్లీని వెనుకేసుకొచ్చాడు.
‘కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేయాల్సిన అవసరం లేదు. అతను జట్టుకు సారథి మాత్రమే. ఆర్సీబీ వైఫల్యానికి అతనొక్కడే కారణం కాదు. ఆర్సీబీ పూర్తిస్థాయి జట్టుతో ఏనాడు సిద్ధం కాలేదు. టీమిండియాకు కూడా కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడు. మరి అక్కడ ఫలితాలు సాధిస్తున్నాడు కదా.? వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా అన్నింటిలోనే కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మెరుగైన విజయాలు నమోదు చేసింది.'అని సెహ్వాగ్ గుర్తు చేశాడు.
ఆర్సీబీ వైఫల్యానికి కారణం ఇదే?
జట్టు సమతూకంగా లేకపోవడమే ఆర్సీబీ వైఫల్యానికి కారణమని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. ‘ఆర్సీబీ జట్టు సమతూకంగా లేదు. ప్రతీజట్టు బ్యాలెన్సింగ్ బ్యాటింగ్ ఆర్డర్ కలిగి ఉంది. ఆర్సీబీలో ఇప్పటివరకూ మంచి బ్యాటింగ్ లైనప్ కనిపించలేదు. ఇప్పుడు ఆర్సీబీలో కోహ్లీ, ఏబీ డివిలియర్స్లు మాత్రమే ఉన్నారు. దాంతో వీరి స్థానాలను మార్చుకుంటూ కింది వరుసలో ఇబ్బంది లేకుండా ప్రయత్నించారు. కానీ అలా ఎప్పుడూ సాధ్యం కాదు. ఆర్సీబీకి ఒక స్పెషలిస్టు ఓపెనర్ కావాలి. అదే సమయంలో లోయర్ ఆర్డర్లో ఒక మంచి బ్యాట్స్మన్ ఉండాలి. కనీసం ఐదుగురు బ్యాట్స్మెన్లు ఆ జట్టులో ఉంటేనే విజయాలు సాధిస్తుంది. ఇక భారత ఫాస్ట్ బౌలర్లపై కూడా ఆ జట్టు నమ్మకం ఉంచాలి'అని సెహ్వాగ్ సూచించాడు.
8 ఏళ్లు చాలా ఎక్కువ..
ఇక అవకాశం దొరికితే విరాట్ కోహ్లీపై నోరు పారేసుకునే గంభీర్.. తాజా ఓటమిపై కొంచెం ఘాటుగానే స్పందించాడు. ఆర్సీబీ కెప్టెన్గా విరాట్ను 8 ఏళ్లుగా కొనసాగించడం చాలా ఎక్కువని, వెంటనే అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలన్నాడు. 'ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవకుండా 8 ఏళ్లు కొనసాగడం చాలా ఎక్కువ. రవిచంద్రన్ అశ్విన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు రెండేళ్లు కెప్టెన్గా ఉన్నాడు. ఫలితం అనుకూలంగా లేకపోవడంతో తప్పించారు. చెన్నైకి ధోనీ మూడు సార్లు, రోహిత్ ముంబైకి నాలుగుసార్లు టైటిల్స్ అందించారు. అందుకే ప్రాంచైజీలు వారిని ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నారు. వారి సారథ్యం కూడా బాగుంది. అలాగే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ చేరే అర్హతనే లేదు' అని గంభీర్ విమర్శలు గుప్పించాడు.
రోహిత్ బెస్ట్ టీమ్కు కెప్టెన్..
ఇక విరాట్ కోహ్లీని ఉద్దేశించి గంభీర్ చేసిన వ్యాఖ్యలను ఆర్సీబీ అభిమానులు తప్పుబడుతున్నారు. జట్టు సమతూకంగా లేనప్పుడు విరాట్ ఏం చేస్తాడని నిలదీస్తున్నాడు. ఇక రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అనే వాదనను తాము ఏమాత్రం అంగీకరించమని, అతను బెస్ట్ టీమ్కు కెప్టెన్ కానీ.. గొప్ప సారథి కాదని కామెంట్ చేస్తున్నారు. రోహిత్ శర్మ లేకున్నా ప్రస్తుత ముంబై ఇండియన్స్ టీమ్ గెలుస్తుందని, అతను డకౌట్ అయినా సునాయస విజయాలందుకుంటుందని ట్వీట్ చేస్తున్నారు . రోహిత్ కన్నా విరాటే ఎంతో బెటరని, అతను తన ఆటతో ఆకట్టుకున్నాడని, ఆర్సీబీ, కోహ్లీ అభిమానులుగా ఎప్పుడూ గర్వపడుతామని గంభీర్కు చురకలంటిస్తున్నారు.
హ్యాపీ బర్త్ డే పిచ్చి పిల్లా.. ప్రేయసికి కేఎల్ రాహుల్ విషెస్!