దుబాయ్: కరోనా నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన టైటిల్ ఫైట్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చేసి మళ్లీ టైటిల్ అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకిది ఐదో టైటిల్ కాగా.. తొలిసారి ఫైనల్కు చేరిన ఢిల్లీ బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది.
ఇక టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్కు రూ.20 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. కరోనా నేపథ్యంలో ఈసారి ప్రైజ్మనీని తగ్గిస్తారని ప్రచారం జరిగినా ఏం తగ్గించలేదు. ఎప్పటిలానే రన్నరప్ జట్టు ఖాతాలో రూ. 12 కోట్ల 50 లక్షలు చేరాయి. ఈ సారి ప్లే ఆఫ్ దశలో ఓడిన రెండు జట్లకు రూ. 6 కోట్ల 37 లక్షల 50 వేల చొప్పున ప్రైజ్మనీ కేటాయించారు.
ఆరెంజ్ క్యాప్- కేఎల్ రాహుల్ (14 ఇన్నింగ్స్ల్లో 670 పరుగులు)
పర్పుల్ క్యాప్- కగిసో రబడా ( 17 ఇన్నింగ్స్ల్లో 30 వికెట్లు)
ఎమర్జింగ్ ప్లేయర్ఆఫ్ ది ఇయర్ అవార్డ్- దేవదత్ పడిక్కల్
ఫెయిర్ ప్లే అవార్డ్- ముంబై ఇండియన్స్
గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్- కేఎల్ రాహుల్
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్- కీరన్ పొలార్డ్ (191.42 స్ట్రైక్ రేట్)
మోస్ట్ సిక్సెస్ అవార్డ్- ఇషాన్ కిషాన్(30 సిక్స్లు)
పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్- ట్రెంట్ బౌల్ట్
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్- జోఫ్రా ఆర్చర్
ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 156 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 65 నాటౌట్), రిషభ్ పంత్( 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 56) రాణించారు. ముంబై బౌలర్లలో బౌల్ట్(3/30) ఢిల్లీ పతనాన్ని శాసించగా.. కౌల్టర్ నీల్ రెండు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు. అనంతరం ముంబై ఇండియన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 68) అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు.