
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు చోటుచేసుకున్న ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ధోని, విరాట్ కోహ్లీలు ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోటోని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తూ పలు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
'చెన్నై-కర్ణాటక ఇప్పుడు స్నేహితులయ్యారు. కావేరీ జలాల సమస్య తీరిపోయిందిక' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.... మరొక నెటిజన్ 'మహీ భాయ్ ఐపీఎల్ కప్లో నాకు చాయ్ తాగించాలి ప్లీజ్' అంటూ కామెంట్ పెట్టాడు. 'ఈ ఫొటో చాలా మాట్లాడుతోందంటూ' అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరొక అభిమాని అయితే వీరిద్దరిని రాముడు-ఆంజనేయుడితో పోల్చుతూ ట్వీట్ పోస్టు చేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లాడిన చెన్నై జట్టు ఐదింటిలో గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే, చిన్నస్వామి స్టేడియంలో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి చేధించింది.
చెన్నై ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (70 నాటౌట్; 34 బంతుల్లో ఒక ఫోర్, 7సిక్సులు) బాదగా, తెలుగు కుర్రాడు అంబటి రాయుడు (82; 53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)తో చెలరేగాడు. 55 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన చెన్నైని వీరిద్దరూ ఆదుకున్నారు. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాయడు ఇచ్చిన సునాయస క్యాచ్ను ఉమేశ్ యాదవ్ జారవిడిచాడు.
ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మ్యాచ్ 15 ఓవర్ల వరకు బెంగళూరు వైపే ఉన్నప్పటికీ, చివరి 5 ఓవర్లలో బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 18 ఓవర్లో రాయుడు 82(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులు)ను ఉమేశ్ యాదవే రనౌట్ చేశాడు.
దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చి బ్రేవో (14) సాయంతో ధోని (70) గెలుపుని సిక్సుతో లాంఛనంగా పూర్తి చేశాడు. బెంగళూరు బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు, ఉమేశ్ యాదవ్, పవన్ నేగి తలో వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది.