స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ల దూరంపై
బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాళ్లు అయిన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఏడాది పాటు క్రికెట్ దూరమైన సంగతి తెలిసిందే. వారిద్దరూ జట్టుకు అందుబాటులో లేకపోవడంతో ఆసీస్ జట్టు కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. అయితే, వారు ఆడకున్నా దాని ప్రభావం జట్టుపై ఏ మాత్రం చూపదని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
పంజాబ్ ప్రదర్శనపై సెహ్వాగ్ ఇలా
ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు మెంటార్గా సేవలందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన పంజాబ్ మూడింటిలో విజయం సాధించగా... ఒకదానిలో ఓటమిపాలైంది. ఐపీఎల్లో పంజాబ్ ప్రదర్శనపై కూడా సెహ్వాగ్ స్పందించాడు.
గేల్ ప్రదర్శన పట్ల సంతృప్తి
ముఖ్యంగా క్రిస్ గేల్ ప్రదర్శన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు సెహ్వాగ్ తెలిపాడు. ఐపీఎల్లో ప్రేక్షకులను గేల్ను మించి ఎంటర్టైన్ చేసే మరో ఆటగాడు లేడని చెప్పుకొచ్చాడు. ఇక, పంజాబ్ ఆడిన తొలి రెండు మ్యాచ్లకు క్రిస్ గేల్ బరిలో దింపకపోవడానికి గల కారణాన్ని వెల్లడిస్తూ 'దీనిపై మా జట్టుకు వ్యూహం ఉంది. మేము వేరే ఆటగాళ్లును కూడా కొనుగోలు చేశాం' అని సెహ్వాగ్ అన్నాడు.
ఐపీఎల్ 11వ సీజన్లో తొలి సెంచరీ గేల్దే
గురువారం రాత్రి పంజాబ్-హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్లో పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ 63 బంతుల్లో 11 సిక్సులు, ఒక ఫోర్ సాయంతో 104 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఐపీఎల్ 11వ సీజన్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ చూసి ఐపీఎల్లోని మిగతా ఫ్రాంచైజీలన్నీ తెగ బాధపడి ఉంటాయి.
కోల్కతా వేదికగా నైట్రైడర్స్తో తలపడనున్న పంజాబ్
ఎందుకంటే జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో గేల్ను ఎవరూ పట్టించుకోలేదు. అయితే, జనవరిలో జరిగిన ఐపీఎల్ వేలంలో చివరి నిమిషంలో క్రిస్ గేల్ను సెహ్వాగ్ కనీస ధర రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అవే ప్రాంఛైజీలు గేల్ను అనవసరంగా మిస్ చేసుకున్నామా? అని బాధపడుతున్నాయి. మరోవైపు కోల్కతా వేదికగా నైట్రైడర్స్తో పంజాబ్ ఈ రోజు తలపడనుంది.