
హైదరాబాద్: రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఆతిథ్య వెస్టిండిస్ జట్టుతో గురువారం జరగనున్న తొలి టెస్టులో రోహిత్ శర్మకు చోటు దక్కుతుందా? లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే, రోహిత్ శర్మ టెస్టుల్లో ఓపెనర్గానే బరిలోకి పంపాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.
వెస్టిండీస్తో తొలి టెస్ట్.. నలుగురు బౌలర్ల వ్యూహంతో భారత్?
మరికొన్ని గంటల్లో ఇరు జట్ల తొలి టెస్టు ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతమైన బ్యాట్స్మన్ అయినా... టెస్టుల్లో మాత్రం ఇప్పటివరకు రాణించలేదు. దీంతో అతడిని టెస్టుల్లోకి పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే తొలి టెస్టులో రోహిత్ శర్మ తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగానే ఉంది.
తొలి టెస్టులో రోహిత్ శర్మను ఆడించాలని మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. రోహిత్ శర్మను ఎంపిక చేస్తేనే జట్టులో సమతుల్యత వస్తుందని ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ చెప్పగా.... మంచి ఫామ్లో ఉన్న రోహిత్ శర్మను ఆడించాలని గంగూలీ పేర్కొన్నాడు.
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఐదు సెంచరీలు చేయడాన్ని ఈ సందర్భంగా గంగూలీ గుర్తు చేశాడు. అదే ఫామ్ను టెస్టుల్లో కూడా కొనసాగించేందుకు రోహిత్ శర్మను ఓపెనర్గా ప్రయోగం చేయాలని జట్టు మేనేజ్మెంట్కు సూచించాడు.
భయమెంటో తెలియని దిగ్గజ బ్యాట్స్మన్తో ఇంటర్య్వూ: యాంకర్గా కోహ్లీ (వీడియో)
అలాగే రహానే మిడిలార్డర్లో ఆడించాలని చెప్పిన గంగూలీ.. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు బదులు రిషబ్ పంత్కే అవకాశమివ్వాలని తెలిపాడు. తొలి టెస్టులో టీమిండియా ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్మెన్తో బరిలోకి దిగితేనే రోహిత్ శర్మకు తప్పకుండా అవకాశం లభిస్తుంది.
అయితే, ఇక్కడ తెలుగు కుర్రాడు హనుమ విహారి నుంచి రోహిత్ శర్మ పోటీని ఎదుర్కొవాల్సి ఉంది. మరోవైపు షోయబ్ అక్తర్ సైతం రోహిత్ శర్మకు మద్దతు పలికాడు. రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకోకపోతే అది తప్పుడు నిర్ణయమే అవుతుందని పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.