కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మొదటి రోజు ఫస్ట్సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ శుభ్మన్ గిల్(87 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. అతనికి తోడుగా చతేశ్వర్ పుజారా(61 బంతుల్లో 15 బ్యాటింగ్) అండగా నిలబడటంతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్.. 29 ఓవర్లలో వికెట్ నష్టానికి 89 రన్స్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జెమీసన్ ఓ వికెట్ తీశాడు.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా తాత్కలిక కెప్టెన్ అజింక్యా రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. స్పిన్నర్ల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేశాడు. ఇక తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్కు నిరాశే ఎదురైంది. అనుభవం కలిగిన వృద్దిమాన్ సాహాకే టీమ్మేనేజ్మెంట్ ఓటేసింది. టీ20 సిరీస్లో గాయపడ్డ మహమ్మద్ సిరాజ్కు కూడా చోటు దక్కలేదు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్లు అవకాశం దక్కించుకున్నారు.
టీ20 సిరీస్కు దూరంగా ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్ సవాల్తో కూడుకున్నది చెప్పాడు. అజాజ్ పటేల్, సోమర్ విల్లే బరిలోకి దిగుతున్నారని, రచిన్ రవీంద్ర అరంగేట్రం చేస్తున్నాడని చెప్పాడు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను కైల్ జెమీసన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 21 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి మయాంక్ అద్భుతంగా ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఆచితూచిగా ఆడుతూ వీలు చిక్కిన బంతిని పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ మరో వికెట్ కోల్పోకుండా లంచ్ సెషన్ను ముగించింది.