ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభం కావాల్సిన రెండో టెస్ట్ మరింత ఆలస్యం కానుంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంబై మైదానం చిత్తడిగా మారింది. ఈ రోజు వర్షం లేకున్నా.. మైదానం చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ఫస్ట్ సెషన్ ఆటను రద్దు చేశారు. ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. దాంతో బంతి పడకుండానే ఈ మ్యాచ్ ఫస్ట్ సెషన్ తుడిచిపెట్టుకుపోయినట్లు అయింది. 11.30 గంటలకు అంపైర్లు మరోసారి మైదానం, పిచ్ను పరిశీలించి మ్యాచ్ నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక ఈ మ్యాచ్కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో అతనికి కివీస్ మేనేజ్మెంట్ విశ్రాంతించింది. ఈ మేరకు బ్లాక్ క్యాప్స్ ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. 'ఎడమ మోచేతి గాయం తిరగబెట్టడంతో మా కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఈ 2021 సీజన్లో అతను ఈ గాయంతో చాలా ఇబ్బంది పడ్డాడు. కేన్ గైర్హాజరీలో టామ్ లాథమ్ ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ను నడిపించనున్నాడు'అని పేర్కొంది. భవిష్యత్తు టోర్నీల నేపథ్యంలోనే కేన్కు రెస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్తో సొంగతగడ్డపై జరిగే సిరీస్లతో కేన్ సేన.. కొత్త ఏడాదిని ప్రారంభించనుంది.
అన్ని అనుకూలతలు ఉన్నా న్యూజిలాండ్తో తొలి టెస్టులో చేతులదాకా వచ్చిన విజయాన్ని చేజిక్కించుకోలేకపోయిన భారత్ ఈసారి అలాంటి తప్పును పునరావృతం చేయరాదని పట్టుదలగా ఉంది. రెండో టెస్టులో గెలుపుతో పాటు సిరీస్ను కూడా సొంతం చేసుకునేందుకు టీమిండియా సన్నద్ధమైంది. గత మ్యాచ్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లి ఈ టెస్టులో అందుబాటులోకి రావడం భారత జట్టు బలాన్ని పెంచింది. మరోవైపు పర్యాటక న్యూజిలాండ్ జట్టు కూడా తీసికట్టుగా ఏమీలేదు. ఒక్క వికెట్ చేతిలో పెట్టుకొని 11 మంది ఆటగాళ్లతో ఓ ఆటాడుకున్న కివీస్ అంతే ఆత్మవిశ్వాసంలో సమరానికి సన్నద్ధమైంది.