కాన్పూర్: న్యూజిలాండ్తో ఫస్ట్ టెస్ట్లో తొలి రోజు దుమ్మురేపిన టీమిండియా.. రెండో రోజు పూర్తిగా తడబడింది. బ్యాటింగ్, బౌలింగ్లో దారుణంగా విఫలమైంది. దాంతో రెండో రోజు ఆటలో న్యూజిలాండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. భారత్ను తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌట్ చేసిన న్యూజిలాండ్.. అనంతరం బ్యాటింగ్కు దిగి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది.
ఓపికగా ఆడితే పరుగులు ఎలా వస్తాయో న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(50 బ్యాటింగ్), విల్ యంగ్(75 బ్యాటింగ్) చూపించారు. ఓ పక్క పేస్.. మరోవైపు భీకరమైన స్పిన్ బౌలింగ్ను ఎదుర్కొని మరీ పరుగులు రాబట్టారు. ఇదే క్రమంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అర్ధశతకాలు సాధించేశారు. తొలి రోజు ఆధిక్యత సాధించిన టీమిండియాపై రెండో రోజు న్యూజిలాండ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్లో దుమ్మురేపిన ఆ జట్టు.. ఆ తర్వాత బ్యాటింగ్లోనూ సత్తా చాటింది.
భారత్ కంటే ఇంకా 216 పరుగులు వెనుకంజలో ఉంది. అంతకుముందు 258/4 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కేవలం 87 పరుగులే చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రవీంద్ర జడేజా (50) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్కు చేరాడు. టీమ్ సౌథీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన సాహా (1) దారుణంగా విఫలమయ్యాడు. అతను కూడా సౌథీ బౌలింగ్లోనే కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగానే ఆడిన శ్రేయస్ అయ్యర్.. టీమ్ సౌథీ 91 ఓవర్ తొలి బంతిని క్విక్ డబుల్ తీసి కెరీర్లో తన తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు.
శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర మ్యాచ్లోనే శతకం బాదేసిన 16వ బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. అయితే కాసేపటికే శ్రేయస్, అక్షర్ పటేల్ (3) ఔటయ్యారు. దీంతో చివర్లో అశ్విన్ (38).. ఉమేశ్ యాదవ్(10)తో కలిసి విలువైన పరుగులు చేశాడు. మిగతా భారత బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 13, శుభ్మన్ గిల్ 52, రహానె 35, పుజారా 26 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
సంక్లిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 345 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 105, శుభ్మన్ గిల్ 52)
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 129/0( టామ్ లాథమ్(50 బ్యాటింగ్), విల్ యంగ్(75 బ్యాటింగ్))