బెన్ స్టోక్స్ నన్ను తిట్టాడు.. అందుకే కోహ్లీ భాయ్ జోక్యం చేసుకున్నాడు: మహ్మద్ సిరాజ్

అహ్మదాబాద్: ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తనను దూషించాడని టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరోపించాడు. దాంతోనే విరాట్ కోహ్లీ జోక్యం చేసుకున్నాడని ఈ హైదరాబాద్ గల్లీ భాయ్ స్పష్టం చేశాడు. మొతేరా మైదానం వేదికగా గురువారం ప్రారంభైన నాలుగో టెస్ట్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా బెన్ స్టోక్స్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై తొలి రోజు ఆట అనంతరం సిరాజ్ స్పష్టతనిచ్చాడు.

స్టోక్స్ తిట్టడంతోనే..
'బెన్ స్టోక్స్ నన్ను దూషించాడు. ఇది గమనించిన విరాట్ భాయ్ జోక్యం చేసుకొని అతనికి బాగా బదులిచ్చాడు. దాన్ని బాగా హ్యాండిల్ చేశాడు. ఇక బ్యాటింగ్కు అనువైన పిచ్ కావడం, బంతి నైస్గా బ్యాట్పైకి దూసుకెళ్తుండటంతో ఓపికగా, ఒకే ప్రదేశంలో బౌలింగ్ చేయాలనుకున్నాం. ఇద్దరు పేసర్లు మాత్రమే ఉన్నారని, ఎక్కువగా రొటేట్ చేస్తూ ఉంటానని ఉదయమే విరాట్ భాయ్ చెప్పాడు. అలాగే కావాల్సిన విశ్రాంతి కూడా లభిస్తుందన్నాడు. నేను రిలయన్స్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసినప్పుడు కొంచెం అదనపు బౌన్స్ లభించింది.

ప్రతీ బాల్ ముందు...
నేను ఆస్ట్రేలియాలో ఆడినా.. ఇక్కడ ఆడుతున్నా ప్రతీ బంతిని అద్భుతంగా వేయాలనుకుంటాను. నేను బాగా బౌలింగ్ చేయకపోతే జట్టును ప్రభావితం చేస్తుంది. బ్యాట్స్మెన్పై ఒత్తిడి లేకుండా చేస్తుంది. అందుకే ప్రతీ బంతికి ముందు బాగా బౌలింగ్ చేయాలని నాకు నేను చెప్పుకుంటాను. వరుసగా రెండు రోజు బ్యాటింగ్ చేయాలనేది మా ప్లాన్. ఈ రెండు రోజులు డ్రెస్సింగ్ రూమ్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటా'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో 14 ఓవర్లు వేసిన సిరాజ్.. జోరూట్(5), బెయిర్ స్టో(28) రెండు కీలక వికెట్లు తీశాడు. ఇందులో 2 మెయిడిన్ ఓవర్లతో పాటు 45 పరుగులిచ్చాడు.

అసలు గొడవ ఏంటంటే..?
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 13వ ఓవర్ వేసిన సిరాజ్.. స్టోక్స్కు వరుసగా షార్ట్ లెంగ్త్, బౌన్సర్లు సంధించాడు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇంగ్లండ్ ఆల్రౌండర్ అసహనంతో సిరాజ్ను దూషించాడు. భారత పేసర్ కూడా అదే రీతిలో బదులిచ్చాడు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధాన్ని గమనించిన విరాట్ కోహ్లీ.. వెంటనే జోక్యం చేసుకొని స్టోక్స్తో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేయడంతో గొడవ సద్దుమనిగింది.
భారత్దే ఆధిపత్యం..
భారీ అంచనాల మధ్య మొదలైన ఆఖరి టెస్ట్ తొలి రోజు ఆటలో భారత్ హవా నడిచింది. అచ్చొచ్చిన స్పిన్ అటాక్తో మరోసారి ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.అనంతరం బ్యాటింగ్లో ఖాతా తెరవకుండానే ఓపెనర్ శుభ్మన్ గిల్(0) వికెట్ కోల్పోయినా.. మరో ఓపెనర్ రోహిత్ శర్మ(34 బంతుల్లో 1 ఫోర్తో 8 బ్యాటింగ్), నయావాల్ చతేశ్వర్ పుజారా(36 బంతుల్లో 1 ఫోర్తో 15 బ్యాటింగ్)తో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్లో తేలిపోయిన ఇంగ్లండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 75.5 ఓవర్లలో 205 పరుగులకు కుప్పకూలింది. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్(55), డాన్ లారెన్స్(46) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్(4/66) నాలుగు, రవిచంద్రన్ అశ్విన్(3/47) మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ సిరాజ్(2/45) రెండు, వాషింగ్టన్ సుందర్(1/14) ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ ఇంకా 181 పరుగుల వెనుకంజలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications