హైదరాబాద్: బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. మూడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. బుధవారం ఉత్కంఠగా జరిగిన రెండో వన్డేలో రోహిత్ సేన 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బొటన వేలి గాయంతో రోహిత్ శర్మ(51 నాటౌట్) చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడి మైదానం వీడిన రోహిత్.. తప్పని పరిస్థితుల్లో జట్టు విజయం కోసం 9వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. అసాధారణ బ్యాటింగ్తో అజేయ హాఫ్ సెంచరీ చేసి భారత్ను గెలిపించినంత పని చేశాడు. కానీ మరో ఎండ్లో అతనికి సహకారం లభించలేదు.
రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ విజయానికి 42 బంతుల్లో 64 పరుగులు కావాలి. కానీ ఎబాదత్ వేసిన 46వ ఓవర్లో బ్యాటింగ్ చేయగల దీపక్ చాహర్ కూడా ఔటవ్వడంతో భారత ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఎబాదత్ వేసిన మరుసటి ఐదు బంతుల్లో రోహిత్.. రెండు భారీ సిక్స్లతో పాటు ఓ బౌండరీ బాది ఆశలు రేకెత్తించాడు. కానీ మెహ్దీ హసన్ వేసిన 47వ ఓవర్లో నాలుగు బంతులాడిన సిరాజ్ సింగిల్ మాత్రమే తీసిచ్చాడు. తర్వాతి రెండు బంతులను రోహిత్ డాట్ చేయడంతో ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ముస్తాఫిజుర్ వేసిన 48వ ఓవర్ను సిరాజ్ పూర్తిగా మెయిడిన్ చేయడం మ్యాచ్ను మలుపు తిప్పింది.
ఈ ఓవర్లో సిరాజ్ సింగిల్ తీసి రోహిత్ స్ట్రైకింగ్కు ఇచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేది. రోహిత్ స్ట్రైక్కు వస్తే ఒక్క బౌండరీ అయినా బాదేవాడు. అప్పుడు బంగ్లా మరింత ఒత్తిడికి లోనయ్యేది. కానీ సిరాజ్ తప్పిదం బంగ్లాకు కలిసొచ్చింది. ఈ మెయిడిన్ ఓవరే మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. 49వ ఓవర్లో రోహిత్ రెండు భారీ సిక్స్లు బాదినప్పటికీ చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి వచ్చింది. రెండు బౌండరీలతో పాటు సిక్స్ కొట్టిన రోహిత్.. ఆఖరి బంతికి కూడా సిక్స్ బాది గెలిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ముస్తాఫిజుర్ తన అనుభవంతో బంతిని డాట్ చేసి బంగ్లా విజయాన్ని లాంఛనం చేశాడు. 46వ ఓవర్, 47వ ఓవర్లో సిరాజ్ బ్యాట్తో చేసిన తప్పిదం భారత విజయవకాశాలను దెబ్బ తీసింది.