న్యూఢిల్లీ: స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి వస్తేనే టీమిండియా బౌలింగ్ బలం పెరుగుతుందని మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. 208 పరుగుల భారీ స్కోరును పేలవ బౌలింగ్తో భారత్ కాపాడుకోలేకపోయింది. డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఓటమి తప్పలేదు. మరీ ముఖ్యంగా హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ కట్టుదిట్టంగా బంతులను సంధించలేకపోయారు.
అయితే రెండో టీ20 మ్యాచ్కు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్నప్పటికీ తొలి టీ20లో బుమ్రాను ఆడించలేదు. దీంతో బుమ్రా వస్తే మాత్రం బౌలింగ్ దళం మరింత బలోపేతమవుతుందని టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. 'బుమ్రా తుది జట్టులోకి వస్తే భారత బౌలింగ్లో తప్పకుండా మార్పు తీసుకురాగలడు. ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. యార్కర్లను సంధించడంలో దిట్ట. ఆసీస్తో తొలి టీ20 మ్యాచ్లో భువీ, హర్షల్ ప్రయత్నించినా సాధ్యపడలేదు. అది బుమ్రా వల్లే తప్పకుండా అవుతుంది. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల సత్తా బుమ్రా సొంతం. అలాగే చివర్లో యార్కర్లు వేయడం ద్వారా బ్యాటర్లను అడ్డుకోగలడు'' అని బంగర్ అభిప్రాయపడ్డాడు.
చివరి ఓవర్లలో పేస్ చాలా కీలకమని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. డెత్ ఓవర్లప్పుడు భువనేశ్వర్లో లోపించిన అంశం ఇదేనని పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ బౌలర్ నసీమ్ షా పేస్తో బంతులను సంధించడం వల్ల భువనేశ్వర్ (52 పరుగులు) కంటే తక్కువగా పరుగులు సమర్పించాడని గుర్తు చేశాడు. 'చివర్లో స్లో డెలివరీలను సంధించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. బ్యాటర్లు సులువుగా అంచనాకు వచ్చి బాదేస్తారు. అదే పేస్తో వేస్తే బ్యాటర్లకు అవకాశం ఉండదు. ఎప్పుడు ఎలాంటి వేగంతో బంతి వస్తుందో తెలియకపోవడం వల్ల భారీ షాట్ల కొట్టేందుకు వెనుకాడతారు. భువనేశ్వర్ ఆసీస్తో ఆఫ్ స్టంప్నకు ఆవల బౌలింగ్ చేయడం వల్ల ఫలితం దక్కలేదు'అని బట్ వివరించాడు.