పేలవ కీపింగ్తో..
అడిలైడ్ టెస్టులో కూడా సాహాకే అవకాశం దక్కింది. అయితే జట్టు బ్యాటింగ్ వైఫల్యం నేపథ్యంలో రెండో టెస్టులో జట్టులోకి వచ్చినా... కొన్ని క్యాచ్లు వదిలేయడంతో విమర్శల ధాటి మరింత తీవ్రమైంది. పంత్ కీపింగ్కు పనికి రాడంటూ అటు అభిమానులు.. ఇటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. టీమ్మేనేజ్మెంట్ పదే పదే పంత్ను ఎందుకు వెనుకేసుకొస్తుందని కూడా నిలదీశారు. కానీ బ్రిస్బేన్ మ్యాచ్తో తాను ఎంతటి విలువైన ఆటగాడినో పంత్ నిరూపించుకున్నాడు. అతని తాజా ప్రదర్శనతో 36 ఏళ్ల సాహాకు అతను చెక్ పెట్టినట్లే. పంత్కు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండకపోవచ్చు.
ఒంటి చేత్తో..
బ్రిస్బేన్లో కీపర్గా ఎక్కడా విఫలం కాని పంత్ బ్యాటింగ్లో తన విలువేమిటో చూపించాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన అతను ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. నలుగురు ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని పంత్ కొట్టిన బౌండరీలు చివరి రోజు హైలైట్గా నిలిచాయి. పంత్ దూకుడు కారణంగానే భారత్ లక్ష్యంవైపు సాగింది. అతను అవుటై ఉంటే జట్టు కూడా 'డ్రా' గురించి ఆలోచించేదేమో. ఇన్నింగ్స్ చివర్లో కూడా స్వేచ్ఛగా ఆడుతూ చెలరేగిపోయాడు. ఉత్కంఠభరిత క్షణాలను దాటి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశాడు. 23 ఏళ్ల ఈ ఢిల్లీ కుర్రాడు సుదీర్ఘ కాలం భారత కీపర్గా అద్భుతాలు చేయగలడనడంలో సందేహం లేదు. ఈ విన్నింగ్స్ పెర్ఫామెన్స్తో పంత్ హీరో అయ్యాడు. దాంతో తిట్టిన నోళ్లే అతన్ని పొగుడుతున్నాయి.
జీవితంలోనే అత్యుత్తమ క్షణం..
ఇక తన సూపర్ పెర్ఫామెన్స్ పట్ల పంత్ భావోద్వేగానికి గురయ్యాడు. తన జీవితంలోనే ఇది అత్యుత్తమ క్షణమన్నాడు. 'నా జీవితంలో ఇదే అత్యుత్తమ క్షణం. నేను ఆడని సమయంలో కూడా జట్టు నాకు అండగా నిలిచింది. ఇది నాకు కలల సిరీస్. నువ్వు మ్యాచ్ విన్నర్వని, గెలిపించాలని మేనేజ్మెంట్ నన్ను బాగా ప్రోత్సహిస్తూ వచ్చింది. నేను ఎప్పుడూ అదే ఆలోచించేవాడిని. ఇప్పుడు అది చేసి చూపించాను. ఐదో రోజు పిచ్ కొంత టర్న్ అవుతుండటంతో షాట్లు ఆడే విషయంలో చాలా జాగ్రత్త పడ్డాను.'అని రిషభ్ పంత్ పేర్కొన్నాడు.
చారిత్రక విజయం..
భారత జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో మరో గొప్ప విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన చివరి టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1 తేడాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. 328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' రిషభ్ పంత్ (138 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చగా... ఓపెనర్ శుబ్మన్ గిల్ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.