35 గజాల దూరం నుంచి..
చివరి బ్యాట్స్మెన్ హేజిల్ వుడ్తో కలిసి క్రీజులో ఉన్న స్మిత్.. బ్యాటింగ్లో ఒక్కసారిగా దూకుడు పెంచాడు. ఈ క్రమంలో బుమ్రా బంతిని స్క్వేర్ లెగ్ దిశగా ఆడిన స్మిత్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే జడేజా మెరుపు వేగం ముందు అది సాధ్యం కాలేదు. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి 25 గజాల దూరం పరుగెత్తుకొచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకొని 35 గజాల దూరంలో ఒకే ఒక స్టంప్ కనిపిస్తుండగా... జడేజా డైరెక్ట్ త్రోను వికెట్లను గిరాటేసి స్మిత్ను రనౌట్ చేసిన తీరు నిజంగా అద్భుతం. మరే ఫీల్డర్ ఉన్నా ఇది సాధ్యం కాకపోయేదనేది వాస్తవం. జట్టులో జడేజా ఉండటం వల్ల వచ్చే అదనపు విలువ ఏమిటో అతని ఈ ఫీల్డింగ్ ప్రదర్శన చూపించింది.
నా మనసులో నిలిచిపోతుంది..
రెండో రోజు ఆట అనంతరం ఈ రనౌట్పై జడేజా మాట్లాడాడు. 'ఈ రనౌట్ను నేను మళ్లీ మళ్లీ చూసుకొని సంతోషిస్తాను. ఇది నా అత్యుత్తమ ప్రదర్శన. 30 గజాల సర్కిల్ బయటి నుంచి ఇలాంటి ఫలితం రాబట్టడం ఎంతో గొప్ప విషయం. మూడు, నాలుగు వికెట్ల తీసిన ప్రదర్శనతో పోలిస్తే ఇది ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతుంది' అని జడేజా వ్యాఖ్యానించాడు.
ఆసీస్ 338 ఆలౌట్..
ఇక జడేజా సూపర్ రనౌట్తో ఆసీస్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్ను 338 పరగులకు ముగించింది. ఓవర్నైట్ స్కోరు 166/2తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్ (226 బంతుల్లో 131; 16 ఫోర్లు) సెంచరీ, లబుషేన్ (196 బంతుల్లో 91; 11 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్తో భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా...బుమ్రా, సైనీ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. శుబ్మన్ గిల్ (101 బంతుల్లో 50; 8 ఫోర్లు), రోహిత్ శర్మ (26) తొలి వికెట్కు 70 పరుగులు జోడించి వెనుదిరిగారు. మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్ ఆదిలోనే రహానే, విహారి వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 84 ఓవర్లలో 4 వికెట్లకు 188 రన్స్ చేసింది. క్రీజులో పుజారా(45 బ్యాటింగ్), పంత్ (34 బ్యాటింగ్) ఉన్నారు.