హైదరాబాద్: న్యూజిలాండ్తో పాటు ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే సిరీస్లకు వేర్వేరు భారత జట్లను చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఆస్ట్రేలియాతో 'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ' కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది.
టీ20లో తన విధ్వంసకర ఆటతో చెలరేగుతున్న సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టెస్టు టీమ్లోకి ఎంపికయ్యాడు. యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా తొలి సారి టెస్ట్ టీమ్ పిలుపు అందుకున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్కు దూరం కాగా.. ఆసియాకప్ 2022 సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన రవీంద్ర జడేజా అవకాశం అందుకున్నాడు. అయితే ఫిట్నెస్ నిరూపించుకుంటేనే అతను జట్టులోకి రానున్నాడని బీసీసీఐ స్పష్టం చేసింది.
టీ20 ప్రపంచకప్ పరాజయం అనంతరం బీసీసీఐ జట్టు ప్రక్షాళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లను టీ20లకు దూరం చేసిన బీసీసీఐ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ నిర్ణయాల్లో తన మార్క్ చూపిస్తున్నాడు. తాజాగా బోర్డు కొత్త సంప్రదాయానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఎంత పెద్ద ఆటగాడైనా గాయం నుంచి కోలుకొని రీఎంట్రీ వచ్చే క్రమంలో నేరుగా జట్టులోకి రాకుండా దేశవాళీ క్రికెట్ ఆడి రావాలనే విధానం తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని రవీంద్ర జడేజాతోనే మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో సిరీస్కు ఎంపికైన రవీంద్ర జడేజాను కనీసం ఓ దేశవాళీ మ్యాచ్ ఆడాలని కోరినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 'జడేజాను కనీసం ఓ దేశవాళీ మ్యాచ్ ఆడాలని బీసీసీఐ సూచించింది. అతను ఫిట్నెస్ నిరూపించుకుంటే టీమిండియా మిడిలార్డర్లో ఉన్న లెఫ్టాండర్ లోటు కూడా తీరుతుంది. అంతేకాకుండా భారత్ ఐదుగురు బౌలర్లతో ఆడే అవకాశం ఉంటుంది.'అని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపాడు.
ఇక నుంచి ప్రతీ ప్లేయర్ నేరుగా జట్టులోకి రావడానికి వీలు లేదని, కనీసం ఒక్క దేశవాళీ మ్యాచ్ అయినా ఆడాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్లో రీఎంట్రీ ఇచ్చిన అర్ష్దీప్ సింగ్ మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దిగి టీమిండియా ఓటమికి కారణమయ్యాడు. గాయం నుంచి కోలుకొని నేరుగా బరిలోకి దిగిన అర్ష్దీప్ సింగ్.. రిథమ్ అందుకోకపోవడంతో ఏకంగా 5 నోబాల్స్ వేసి చెత్త రికార్డు నమోదు చేశాడు. దాంతో ఎంత సీనియర్ అయినా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా బరిలోకి దింపవద్దని గంభీర్, గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు సూచించారు. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రాకు కూడా ఈ రూల్ వర్తించనుంది.